Mohammad Shami : భారత జట్టు స్టార్ పేసర్ మహమ్మద్ షమీ(Mohammad Shami) కాలి మడమ సర్జరీ నుంచి కోలుకుంటున్నాడు. ప్రస్తుతం లండన్లో ఉన్న ఈ స్పీడ్స్టర్ త్వరలోనే స్వదేశం రానున్నాడు. బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ(NCA)లో షమీ రిహాబిలిటేషన్లో ఉండనున్నాడు. ఈ విషయాన్ని బీసీసీఐ గురువారం వెల్లడించింది.
ఇంగ్లండ్తో ధర్మశాలలో మార్చి 7న జరిగే ఐదో టెస్టు కోసం స్క్వాడ్ను ప్రకటించింది. అనంతరం షమీ అరోగ్యంపై స్పందిస్తూ.. ‘షమీకి ఫిబ్రవరి 26న కుడి మోకాలి సర్జరీ విజయవంతమైంది. అతడు వేగంగా కోలుకుంటున్నాడు. షమీ త్వరలోనే ఎన్సీఏలో రిహాబిలిటేషన్లో ఉంటాడు’ అని బీసీసీఐ ఓ ప్రకటనలో తెలిపింది.
లండన్లో సర్జరీ చేయించుకున్న షమీ
వన్డే వరల్డ్ కప్ తర్వాత షమీ కాలి మడమ గాయంతో దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్ టెస్టు సిరీస్లకు దూరమయ్యాడు. ఇప్పుడు సర్జరీ చేయించుకున్న అతడు కోలుకునేందుకు రెండు మూడు నెలలపైనే పట్టొచ్చు. దాంతో, వచ్చే నెలలో మొదలయ్యే ఐపీఎల్ 17వ సీజన్లో గుజరాత్ టైటాన్స్(Gujarat Titans) షమీ సేవల్ని కోల్పోనుంది. అంతేకాదు జూన్ 1న ఆరంభం కానున్న టీ20 వరల్డ్ కప్లోపు షమీ ఫిట్నెస్ సాధిస్తాడా? లేదా? అనేది అనుమానమే.
నిరుడు స్వదేశీ గడ్డపై జరిగిన వన్డే ప్రపంచకప్లో షమీ అద్భుతంగా రాణించాడు. మొత్తంగా 24 వికెట్లు తీసి టీమిండియా విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. టైటిల్ పోరులోనూ షమీ మూడు వికెట్లు తీసినా.. ట్రావిస్ హెడ్ సూపర్ సెంచరీతో ఆసీస్ను గెలిపించాడు. అయితే.. 2023లో అత్యుత్తమంగా రాణించిన షమీని ప్రతిష్ఠాత్మక అర్జున(Arjuna) అవార్డు వరించింది. రాష్ట్రపతి భవన్లో ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అతడు ఈ అవార్డు స్వీకరించాడు.