ప్రపంచ క్రికెట్లో అత్యంత ధనవంతమైన క్రికెట్ బోర్డుగా బీసీసీఐకి పేరుంది. ప్రపంచ క్రికెట్ను శాసించేగలిగే సత్తా ఉన్న బోర్డు చర్యలు కూడా ‘రిచ్’గానే ఉన్నాయి. అవును.. మాంచెస్టర్ (ఇంగ్లండ్)లో మూడో వన్డే ముగిసిన తర్వాత ప్రత్యేకంగా చార్టర్డ్ ఫ్లైట్లో భారత ఆటగాళ్లను పోర్ట్ ఆఫ్ స్పెయిన్ (వెస్టిండీస్) కు పంపించింది. దీనికోసం బీసీసీఐ చేసిన ఖర్చు ఏకంగా రూ. 3.5 కోట్లు.
ఇంగ్లండ్తో సిరీస్ ముగిసిన తర్వాత విండీస్తో వన్డే సిరీస్ ఆడేందుకు గాను శిఖర్ ధావన్ సారథ్యంలోని భారత జట్టు కరేబియన్ దీవులకు పయనమైన విషయం తెలిసిందే. భారత క్రికెటర్ల బృందం, వారి భార్యాపిల్లలు, హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ తో పాటు ఇతర సిబ్బంది అందరినీ చార్టర్డ్ ఫ్లైట్లో పంపింది బీసీసీఐ. సాధారణంగా కమర్షియల్ ఫ్లైట్స్లో అయితే ఇంతమందిని మాంచెస్టర్ నుంచి పోర్ట్ ఆఫ్ స్పెయిన్ పంపడానికి రూ. 2 కోట్లు ఖర్చవుతుంది.
సాధారణ రోజుల్లో బిజినెస్ క్లాస్ టికెట్ అయినా ఈ రెండు సిటీల మధ్య ప్రయాణానికి రూ. 2 లక్షలు ఖర్చవుతుంది. దీని ప్రకారం భారత బృందానికి అంతా కలిసి రూ. 2 కోట్లు అయ్యేది. కానీ ప్రస్తుతం కొవిడ్-19 ఆంక్షలు తొలిగిపోవడంతో విమానాల్లో రద్దీ పెరిగిపోయింది. దీంతో వాటికోసం వేచి ఉండటం.. ఇంతమంది ఆటగాళ్లకు, సిబ్బందికి టికెట్లు బుక్ చేయడం వంటి తంటాలేమీ లేకుండా ఉండేందుకే తాము ప్రత్యేక విమానం బుక్ చేసుకున్నామని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు.
ప్రస్తుతం ఫుట్బాల్ జట్లు చాలామట్టుకు ఇదే సూత్రాన్ని ఫాలో అవుతున్నాయని సదరు అధికారి వివరించారు. శుక్రవారం నుంచి ప్రారంభం కాబోయే తొలి వన్డేతో భారత జట్టు తమ సిరీస్ వేటను ప్రారంభించనుంది.