బెంగళూరు: ఆలస్యంగా అయినా బీసీసీ నిద్ర లేచింది. టెస్టుల్లో మరీ ముఖ్యంగా స్వదేశంలో న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా చేతిలో అవమానకర ఓటముల నేపథ్యంలో కొత్త తరం క్రికెటర్లను రాటుదేల్చేందుకు ప్రత్యేక శిక్షణా శిబిరాలకు ఏర్పాటుచేసింది. బెంగళూరులోని బీసీసీఐ సీవోఈలో దిగ్గజ పేసర్ జహీర్ ఖాన్తో యువ పేసర్లకు ఐదు రోజుల స్పెషల్ క్యాంప్ను ఏర్పాటుచేసింది. జహీర్ ఇప్పటికే సీవోఈలో యువ బౌలర్లకు సూచనలిస్తున్నాడు. అలాగే ఆఫ్ స్పిన్నర్ల కోసం హర్భజన్ సింగ్తో, రిస్ట్ స్పిన్నర్ల కోసం అనిల్ కుంబ్లేతోనూ ఐదు రోజుల పాటు ప్రత్యేక క్యాంపులను ఏర్పాటుచేసేందుకు బీసీసీఐ సిద్ధమైంది. అత్యుత్తమ ప్రతిభ కల్గి ఉండి జాతీయ జట్టుకు ఆడగలిగే సామర్థ్యం ఉన్న క్రికెటర్ల కోసం ఈ క్యాంపులు ఎంతగానో ఉపయోగపడతాయని బీసీసీఐ భావిస్తున్నది. ఈ మేరకు సీవోఈ చీఫ్ వీవీఎస్ లక్ష్మణ్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుని తన మాజీ సహచరులతో సంప్రదింపులు జరిపాడని, త్వరలోనే భజ్జీ, కుంబ్లే యువ బౌలర్లకు స్పిన్లో మెళుకువలు నేర్పిస్తారని సీవోఈ వర్గాలు తెలిపాయి.