ICC : భారత క్రికెట్ నియంత్రణా మండలి (BCCI)పై కాసుల వర్షం కురియనుంది. ప్రపంచంలోనే అత్యంత ధనిక బోర్డుగా గుర్తింపు సాధించిన బీసీసీఐకి ఇకపై ఏటా అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) నుంచి పెద్ద మొత్తంలో ఆదాయం సమకూరనుంది. ఐసీసీ నుంచి వచ్చే ఆదాయంలో బీసీసీఐ వాటా 72 శాతం పెరగడమే అందుకు కారణం. దీంతో ఏడాదికి 231 మిలియన్ల డాలర్లు (సుమారు రూ. 2,000 కోట్లు) భారత బోర్డు అందుకోనుంది. ఇటీవల డర్బన్(Durban) వేదికగా జరిగిన ఐసీసీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
కొత్త రెవెన్యూ మోడల్ ప్రకారం ప్రతి ఏడాది ఐసీసీ నుంచి 38.5 శాతం వాటా బీసీసీఐకి దక్కనుంది. గతంలో భారత్కు 22.4 శాతం వాటా మాత్రమే ముట్టేది. అయితే.. తమకు భారీగా ఆదాయాన్ని సమకూర్చి పెడుతున్న బీసీసీఐకి తిరిగి అదే స్థాయిలో డబ్బులు ఇవ్వాలని ఐసీసీ అనుకుంది. ఈ అంశంపై గత కొంతకాలంగా చర్చించిన ఐసీసీ పెద్దలు కీలక నిర్ణయంతో బీసీసీఐ వాటాను అమాంతం పెంచారు. ఐసీసీ నిర్ణయంపై భారత క్రికెట్ బోర్డు సెక్రటరీ జై షా(Jai Shah) హర్షం వ్యక్తం చేశాడు.
బీసీసీఐ సెక్రటరీ జై షా
‘దక్షిణాఫ్రికా(Southafrica)లో జరిగిన ఐసీసీ సర్వసభ్య సమావేశంలో కొత్త రెవెన్యూ విధానానికి ఆమోద ముద్ర లభించింది. దీంతో ఇప్పటి వరకు ఐసీసీ ఆదాయంలో 22.4 శాతం వాటా దక్కించుకుంటున్న భారత్.. ఇకపై 38.5 శాతం అందుకోనుంది. దీంతో 72 శాతం ఆదాయం పెరిగినౖట్లెంది. ఇదంతా సమిష్టి కృషితోనే సాధ్యమైంది’ అని జై షా పేర్కొన్నాడు. ఈ నిధులను క్రీడను మరింత విస్తృత పరిచేందుకు వినియోగించనున్నట్లు ఆయన రాష్ట్ర క్రికెట్ సంఘాలకు తెలిపారు.