ODI WC 2023 : భారత క్రికెట్ బోర్డు తాజాగా హైదరాబాద్ క్రికెట్ సంఘాని(Hyderabad Cricket Association)కి షాకిచ్చింది. ఎట్టి పరిస్థితుల్లోనూ వన్డే వరల్డ్ కప్(ODI WC 2023) షెడ్యూల్ మార్చే ప్రసక్తే లేదని స్ఫష్టం చేసింది. మెగా టోర్నీ ఆరంభానికి సమయం దగ్గర పడిందని, ఈ పరిస్థితుల్లో షెడ్యూల్ మార్చడం కుదరని తేల్చి చెప్పింది. దాంతో, ప్రపంచ కప్ మ్యాచ్ల తేదీ మార్పులపై కొండంత ఆశ పెట్టుకున్న హెచ్సీఏ పెద్దలకు నిరాశే మిగిలింది. హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియం(Uppal Stadium) ఈసారి పలు మ్యాచ్లకు ఆతిథ్యం ఇస్తోంది. అయితే.. అక్టోబర్ 9న, అక్టోబర్ 10న వరుస తేదీల్లో రెండు మ్యాచ్లు ఉండడంపై హెచ్సీఏ అభ్యంతరం వ్యక్తం చేసింది.
ఆటగాళ్లు మ్యాచ్ ప్రాక్టీస్ చేసేందుకు అవకాశం ఉండదని, ఒక మ్యాచ్ తేదీని మార్చాలని బీసీసీఐని కోరింది. కానీ, రోజర్ బిన్ని(Rojer Binny) నాయకత్వంలోని భారత క్రికెట్ బోర్డు ససేమిరా అంది. ‘వరుస తేదీల్లో రెండు మ్యాచ్ల విషయమై బీసీసీఐ పెద్దలతో చర్చించాం. కానీ, టోర్నీకి సమయం దగ్గరపడినందున ఇప్పుడు మార్పులు సాధ్యం కాదని తేల్చి చెప్పారు. అందుకని మేము వాళ్లకు సహకరించాలని నిర్ణయించుకున్నాం’ అని సుప్రీం కోర్టు నియమించిన సభ్యుడు దుర్గా ప్రసాద్(Durga Prasad) వెల్లడించాడు.
ఉప్పల్ స్టేడియం
బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా(Rajeev Shukla) కూడా ఇదే అభిప్రాయం వెలిబుచ్చాడని హెచ్సీఏ వర్గాలు తెలిపాడు. వరల్డ్ కప్ షెడ్యూల్పై బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా ఇప్పటికే ఓ ప్రకటన విడుదల చేశాడు. చివరి నిమిషంలో తేదీలు, వేదిక మార్పులు చేయబోమని అందులో స్పష్టంగా చెప్పాడు. కాబట్టి అక్టోబర్ 9, 10వ తేదీన ఉప్పల్లో జరగాల్సిన మ్యాచ్లకు ఏర్పాట్లపై దృష్టి పెడుతున్నాం. పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్(CV Anand) తో కూడా మాట్లాడాం. ఆయన అన్ని విధాలా సహకారం అందిస్తామని మాటిచ్చాడు అని హెచ్సీఏ అధికారులు వెల్లడించారు.
నెదర్లాండ్స్, న్యూజిలాండ్ జట్లు
అక్టోబర్ 9న న్యూజిలాండ్, నెదర్లాండ్స్ జట్లు ఉప్పల్లో తలపడనున్నాయి. ఆ మరుసటి రోజే పాకిస్థాన్, శ్రీలంక మ్యాచ్ ఉంది. ఈ రెండూ డే అండ్ నైట్ మ్యాచ్లే. అక్టోబర్ 5న షురూ కానున్న వరల్డ్ కప్ పోటీలకు 12 స్టేడియాలు అతిథ్యం ఇస్తున్నాయి. అహ్మదాబాద్ స్టేడియంలో ఆరంభ, ముగింపు మ్యాచ్లు జరుగనున్నాయి. ఈసారి సెమీఫైనల్స్కు కూడా రిజర్వ్ డేను కేటాయించడం విశేషం.