Shikhar Dhawan : టీమ్ఇండియా సీనియర్ ఓపెనర్ శిఖర్ ధవన్(Shikhar Dhawan)కు భారత సెలెక్షన్ కమిటీ పొమ్మనలేక పొగబెట్టింది. ఇటీవల వెస్టిండీస్ పర్యటనతో పాటు, త్వరలో జరగనున్న ఆసియా గేమ్స్(Asia Games 2023) జట్లలో ధవన్కు చోటు దక్కలేదు. దాంతో, ఐసీసీ టోర్నీ(ICC Tournaments)ల్లో మంచి రికార్డు ఉన్న ధవన్కు మరో అవకాశం కల్పిస్తారేమోనని ఎదురు చూసిన అభిమానులకు నిరాశే ఎదురైంది. ఇక్కడితో గబ్బర్ కెరీర్ ముగిసినట్లేనని అంతా భావిస్తున్నారు. అయితే ఆసియా కప్ పోటీలకు జట్టు ఎంపిక అనంతరం చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ మాట్లాడుతూ.. ధవన్ భారత జట్టుకు ఎంతో చేశాడని.. ఐసీసీ టోర్నీల్లో అతడి గణాంకాలు అద్భుతమని కొనియాడాడు.
అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో ధవన్ను జట్టుకు ఎంపిక చేసే ఆలోచనలేదని అగార్కర్(Ajit Agarkar) స్పష్టం చేశాడు. రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్, ఇషాన్ కిషన్లను ఓపెనర్లుగా పరిగణిస్తున్నామని అతను పేర్కొన్నాడు. దీంతో ధవన్ కెరీర్కు ఫుల్ స్టాప్ పడ్డట్లు అయింది. అభిమానులతో ముద్దుగా గబ్బర్ అని పిలిపించుకునే ధవన్ వన్డే ఫార్మాట్లో జరిగిన 2018 ఆసియా కప్లో అద్భుతంగా రాణించాడు. 59.33 సగటుతో 534 పరుగులు చేశాడు.
శిఖర్ ధవన్
దాంతో, భారత్ తరఫున అత్యధిక రన్స్ కొట్టిన ప్లేయర్గా నిలిచాడు. అందులో రెండు శతకాలు, రెండు అర్ధశతకాలు ఉన్నాయి. మరోవైపు గాయం నుంచి కోలుకొని ఐర్లాండ్ సిరీస్(Ireland Series)లో సత్తాచాటుతున్న జస్ప్రీత్ బుమ్రా, ప్రసిద్ధ్ కృష్ణకు ఆసియా కప్(Asia Cup 2023) జట్టులో చోటు దక్కింది. కానీ, మరో సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్(Bhuvaneshwar Kumar)ను మాత్రం సెలెక్టర్లు పరిగణించలేదు. దీంతో శిఖర్ ధవన్, భువీపై సోషల్ మీడియా వేదికగా అభిమానులు సానుభూతి వ్యక్తం చేస్తున్నారు.