ముంబై : భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ ఏడాది సెప్టెంబర్లో బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, కార్యదర్శి జైషా పదవీకాలం ముగియనున్నది. ఈ పరిస్థితుల్లో కూలింగ్ ఆఫ్ పీరియడ్ ( పదవీకాలం ముగిసినప్పటి నుంచి కొత్త పాలకవర్గం నియామక ప్రక్రియ పూర్తయ్యే వరకు) పొడగించాలంటూ బోర్డు అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. నిబంధనల సవరకు సంబంధించి కోర్టులో బోర్డు దాఖలు చేసిన పిటిషన్ను త్వరగా విచారించాలని బీసీసీఐ కోర్టును కోరింది. ఈ అప్పీల్పై సీజేఐ ఎన్వీ రమణ ఈ అంశంపై వచ్చేవారం విచారించవచ్చో? లేదో? చూస్తామన్నారు.
బీసీసీఐ 2019లోనే సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఇందులో బోర్డుకు సంబంధించిన రాజ్యాంగాన్ని సవరించాలని విజ్ఞప్తి చేసింది. ఇందులో బోర్డు చైర్మన్, కార్యదర్శి సహా పలువురి కూలింగ్ ఆఫ్ పీరియడ్ను పెంచాలని కోరింది. దీంతో పాటు పలు నిబంధనల్లో మార్పులపై సైతం బీసీసీఐ కోర్టును విజ్ఞప్తి చేసింది. గంగూలీ, జైషా బీసీసీఐ అధ్యక్ష, కార్యదర్శలుగా 2019 అక్టోబర్లో బాధ్యతలు చేపట్టారు. పదవీకాలం మూడేళ్లు కాగా.. పదవీకాలం సెప్టెంబర్లో ముగియనున్నది. దీంతో బీసీసీఐ తదుపరి కార్యవర్గం నియామకాన్ని చేపట్టేందుకు వీలైనంత త్వరగా పిటిషన్పై వాదనలు వినాలని విజ్ఞప్తి చేసింది.