న్యూఢిల్లీ: భారత క్రికెట్ నియంత్రణా మండలి(బీసీసీఐ) పర్యావరణ పరిరక్షణ కోసం నడుం బిగించింది. ప్రపంచంలోనే అతి ఖరీదైన క్రికెట్ లీగ్గా వెలుగొందుతున్న ఐపీఎల్ ద్వారా సమాజానికి ఎంతోకొంత మేలు చేయాలనే ఉద్దేశంతో మొక్కల పెంపకానికి సిద్ధమైంది. అనుకున్నదే తడువుగా లీగ్ ఆఖరి దశ ప్లేఆఫ్స్ మ్యాచ్ల్లో అమలు చేసేందుకు కొత్త కాన్సెప్ట్ను ప్రవేశపెట్టింది. మే 23వ తేదీన ఎంఏ చిదంబరం స్టేడియం వేదికగా చెన్నై సూపర్కింగ్స్, గుజరాత్ జెయింట్స్ మధ్య జరిగిన క్వాలిఫయర్-1 మ్యాచ్లో ఇందుకు వేదికైంది. ఒక్కో డాట్ బాల్కు 500 మొక్కలు అంటూ బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. ఇంకేముంది అప్పటికే లీగ్ దశలో దుమ్మురేపిన బౌలర్లు కీలకమైన ప్లేఆఫ్స్లోనూ తమ తఢాఖా చూపెట్టారు. బ్యాటర్ల ఆధిపత్యానికి గండికొడుతూ మ్యాచ్ మొత్తమ్మీద 84 డాట్బాల్స్ వేశారు. దీని ద్వారా తొలి మ్యాచ్ ద్వారానే అనూహ్యంగా 42,000 మొక్కలు నాటేందుకు బీజం పడింది.
ఆ తర్వాత ముంబై ఇండియన్స్, లక్నో సూపర్జెయింట్స్ జట్ల మధ్య జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్లో ఏకంగా 96 డాట్బాల్స్ నమోదయ్యాయి. ముంబై యువ పేసర్ ఆకాశ్ మద్వాల్ ఏకంగా 17 డాట్బాల్స్తో టాప్లో నిలిచాడు. కేవలం ఐదు పరుగులే ఇచ్చుకున్న ఆకాశ్ ఐదు వికెట్లు పడగొట్టి ముంబై విజయంలో కీలకమయ్యాడు. ఆ తర్వాత జరిగిన క్వాలిఫయర్-2లో ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య పోరులో 67 డాట్బాల్స్ను బౌలర్లు నమోదు చేశారు. భారీ స్కోరింగ్ మ్యాచ్లో గుజరాత్ చేతిలో ముంబై పోరాడి ఓడింది. ఈ మ్యాచ్ ద్వారా 33,500 మొక్కలు ఖాతాలో చేరాయి. ఇక వరుణుడు అంతరాయం కారణంగా రెండు రోజుల పాటు జరిగిన ఐపీఎల్ ఫైనల్లో తక్కువగా 45 డాట్బాల్స్ నమోదయ్యాయి. వర్షం తాకిడితో అంపైర్లు ఈ మ్యాచ్లో ఓవర్లు తగ్గించడం ఒక రకంగా తక్కువ డాట్బాల్స్కు కారణమైంది.
45 డాట్బాల్స్ ద్వారా 22,500 మొక్కలు జతకలిశాయి. ఆఖరి బంతి వరకు హోరాహోరీగా సాగిన టైటిల్ పోరులో మహేంద్రసింగ్ ధోనీ నేతృత్వంలోని చెన్నై రికార్డు స్థాయిలో ఐదోసారి ఐపీఎల్ ట్రోఫీని సగర్వంగా ముద్దాడింది. ఇదిలా ఉంటే లీగ్లో మొత్తంగా నాలుగు ప్లేఆఫ్స్ మ్యాచ్ల్లో 292 డాట్బాల్స్ నమోదు అయ్యాయి. ఒక్కో డాట్బాల్కు 500ల మొక్కల చొప్పున మొత్తం 292 డాట్బాల్స్కు 1,46,000 మొక్కలు నాటేందుకు బీసీసీఐ సిద్ధమైంది. పెరిగిపోతున్న వాతావరణ కాలుష్యాన్ని తగ్గించేందుకు బోర్డు తీసుకున్న మొక్కల పెంపకం నిర్ణయాన్ని అందరూ హర్షిస్తున్నారు.
పర్యావరణ పరిరక్షణలో పాలుపంచుకునేందుకు సిద్ధమైన బీసీసీఐ మొక్కల పెంపు నిర్ణయం భేష్ అంటూ రాజ్యసభ ఎంపీ సంతోష్కుమార్ అభినందించారు. బుధవారం ఒక ప్రకటనలో బోర్డు నిర్ణయాన్ని ఆయన స్వాగతించారు. ఈ మేరకు బోర్డు అధ్యక్షుడు రోజర్ బిన్నీకి ఆయన ప్రత్యేకంగా లేఖ రాశారు. ‘ఈ మధ్యే ముగిసిన ఐపీఎల్ ప్లేఆఫ్స్ మ్యాచ్ల్లో డాట్బాల్స్ ద్వారా మొక్కలు పెంపకాన్ని బోర్డు నిర్ణయం తీసుకోవడం చాలా బాగుంది. ఒక్కో డాట్బాల్కు 500 మొక్కల చొప్పున దాదాపు లక్షా 47వేల మొక్కలను నాటేందుకు సిద్ధమైన బీసీసీఐకి నాతో పాటు గ్రీన్ఇండియా చాలెంజ్ తరఫున హృదయపూర్వక అభినందనలు. పర్యావరణాన్ని పరిరక్షించేందుకు మేలు చేయాలన్న మొక్కల పెంపకం ఆలోచన చాలా గొప్పది’ అంటూ పేర్కొన్నారు.