BCCI Guidelines | ఇక మీడియాకు నేరుగా టీం ఇండియా క్రికెటర్లు అందుబాటులోకి రారా.. బీసీసీఐ మీడియా మేనేజర్ ద్వారానే స్పందించాలా.. అంటే అవుననే సమాధానమే వస్తున్నది. టీం ఇండియా సీనియర్ వికెట్కీపర్ వృద్ధిమాన్ సాహా- జర్నలిస్ట్ మధ్య వివాదం వెలుగు చూడటంతో బీసీసీఐ మేల్కొన్నట్లు సమాచారం. ఇక బీసీసీఐతో కాంట్రాక్ట్ కుదుర్చుకున్న క్రికెటర్లకు మీడియాతో నేరుగా సంప్రదించే అంశంపై సరికొత్త మార్గదర్శకాలు అమల్లోకి తెచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. త్వరలో శ్రీలంకతో మొదలయ్యే సిరీస్ నుంచే కొత్త గైడ్లైన్స్ను ఆచరణలోకి తేవాలని బీసీసీఐ నిర్ణయించినట్లు సమాచారం.
బీసీసీఐ వర్గాల కథనం ప్రకారం ఇక నుంచి తమతో కాంట్రాక్టులో ఉన్న క్రికెటర్లతో నేరుగా మీడియా ప్రతినిధులు మాట్లాడకూడదు. ఇక నుంచి బీసీసీఐ మీడియా మేనేజర్ నుంచే క్రికెటర్లు-మీడియా ప్రతినిధుల మధ్య సమాచారం బదిలీ జరగాలి. అయితే, బహిరంగ వేడుకలు, మీడియా సమావేశాల్లో మాత్రం క్రికెటర్లు మీడియాతో మాట్లాడే వెసులుబాటు యథాతథంగా కొనసాగుతుంది.
ఇక నుంచి తమకు సమాచారం ఇవ్వకుండా అనుచిత వ్యాఖ్యలు చేసే క్రికెటర్పైన బీసీసీఐ నిషేధం గానీ, జరిమానా విధించే అవకాశం ఉంది. అంతే కాదు బీసీసీఐ మీడియా మేనేజర్ అనుమతి లేకుండా క్రికెటర్ల ఇంటర్వ్యూలు తీసుకునే మీడియా ప్రతినిధులను ఏడాది బ్లాక్ లిస్ట్ లో పెట్టే అవకాశం ఉంది. ఈ నిబంధనలు యూ-19 క్రికెటర్లకూ వర్తిస్తాయి. భవిష్యత్లో వృద్ధిమాన్ సహా తరహా ఘటనలు పునరావృతం కాకుండా బీసీసీఐ పటిష్ట చర్యలు తీసుకునే దిశగా అడుగులేస్తున్నది.