న్యూఢిల్లీ: వెస్టిండీస్లో అండర్-19 ప్రపంచకప్ ఆడుతున్న భారత క్రికెట్ క్యాంపులో కరోనా కలకలం రేపింది. క్యాంపులోని నలుగురు ఆటగాళ్లకు కరోనా పాజిటివ్ వచ్చింది. దాంతో బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (బీసీసీఐ) ఐదుగురు రిజర్వ్ ఆటగాళ్లను వెస్టిండీస్కు పంపాలని నిర్ణయించింది. ఆ మేరకు ఉధయ్ సహరన్, అభిషేక్ పోరెల్ (వికెట్ కీపర్), రిషిత్ రెడ్డి, అన్ష్ గోసాయ్, పీఎం సింగ్ రాథోడ్ల పేర్లను ఖరారు చేసింది. ఈ ఐదుగురు ప్లేయర్లు తక్షణమే వెస్టిండీస్కు బయలుదేరనున్నారు.
అండర్-19 వరల్డ్ కప్లో భారత జట్టు తొలి రెండు మ్యాచ్లలో గెలిచి మంచి ఊపుమీద ఉన్నది. తొలి మ్యాచ్లో దక్షిణాఫ్రికాపై, రెండో మ్యాచ్లో ఐర్లాండ్పై భారత్ విజయం సాధించింది. దాంతో ఇప్పటికే క్వార్టర్ ఫైనల్ బెర్త్ ఖాయం చేసుకున్న టీమిండియా శనివారం ఉగాండాతో చివరి లీగ్ మ్యాచ్ ఆడనుంది. ఆ తర్వాత ఈ నెల 29న ఇంగ్లండ్తో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో తలపడనుంది. కాగా, ఐర్లాండ్తో మ్యాచ్కు ముందు టీమిండియాలో నలుగురు ప్లేయర్లకు పాజిటివ్గా తేలింది.
ముందుగా స్కిప్పర్ యశ్ ధుల్, వైస్ కెప్టెన్ ఎస్కే రషీద్కు పాజిటివ్ వచ్చింది. ఆ తర్వాత మరో ఇద్దరిలో లక్షణాలు బయటపడ్డాయి. ఈ క్రమంలో మొత్తం ఆరుగురు ప్లేయర్లను సెల్ఫ్ ఐసోలేషన్లో ఉంచారు. దాంతో ప్లేయర్ల కొరతతోనే భారత్.. ఐర్లాండ్తో తలపడింది. అయితే 29న క్వార్టర్ ఫైనల్ నాటికి ఆ కొరత ఉండకూడదనే ఉద్దేశంతో బీసీసీఐ రిజర్వ్ ప్లేయర్లను పంపుతున్నది.