BCCI: ప్రపంచంలోనే అత్యంత ధనిక బోర్డుగా గుర్తింపు సాధించిన.. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఒకప్పుడు ఆటగాళ్లకు నగదు పురస్కారాలు ఇచ్చేందుకు తీవ్రంగా ఇబ్బంది పడిందంటే నమ్మగలరా! అదేంటి ప్రసార హక్కుల విక్రయంతో వేలాది కోట్లు, అఫీషియల్ స్పాన్సర్లు, పార్ట్నర్ లు, అడ్వౖర్టెజ్మెంట్లు, ఎండార్స్మెంట్లు, సోషల్ మీడియా ఇలా వివిధ రూపాల్లో డబ్బు వచ్చి పడుతుంటే.. బీసీసీఐకి నగదుకు కొదవేంటి అనుకుంటున్నారా? ఇప్పుడంటే బీసీసీఐ బలమైన ఆర్థిక వ్యవస్థగా ఎదిగింది. కానీ, ఒకప్పుడు మాత్రం పరిస్థితి దీనికి పూర్తిగా భిన్నం!
1983 ప్రపంచకప్లో ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగిన కపిల్ దేవ్ సారథ్యంలోని భారత్.. అంచనాలకు మించి రాణిస్తూ.. వరుస విజయాలతో చాంపియన్గా నిలిచింది. కపిల్దేవ్ ఆల్రౌండ్ ప్రదర్శనతో జట్టును ముందుండి నడిపించగా.. అమర్నాథ్, గవాస్కర్, రోజర్ బిన్నీ, సయ్యద్ కిర్మాణీ, రవిశాస్త్రి, ప్రభాకర్ ఇలా ప్రతి ఒక్కరు తమవంతు పాత్ర పోషించారు. అప్పటికే ప్రపంచ క్రికెట్ను ఏకఛత్రాధిపత్యంతో ఏలుతున్న వెస్టిండీస్కు మనవాళ్లు చుక్కలు చూపారు. దీంతో ఆటగాళ్లకు సన్మానించాలని బోర్డు భావించింది. కానీ ఏం చేస్తాం బీసీసీఐ దగ్గర అందుకు తగ్గ నగదు లేకపోయింది!
లతా మంగేష్కర్తో సంగీత విభావరి
దీంతో తన మధురమైన గాత్రంతో సంగీత ప్రపంచాన్ని ఓలలాడిస్తున్న .. ప్రఖ్యాత గాయని లతా మంగేష్కర్ను సంప్రదించారు. భారత క్రికెట్ జట్టుకు వీరాభిమాని అయిన లతా దీదీ.. వెంటనే ఒక ప్రతిపాదన తెచ్చింది. ప్రత్యేక కచేరీ నిర్వహించి.. దాని ద్వారా వచ్చిన డబ్బులను ఆటగాళ్లకు ఇస్తే బాగుంటుందని పేర్కొంది. ఇచ్చిన మాట ప్రకారం వరల్డ్కప్ ముగిసిన అనంతరం ముంబైలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించి వచ్చిన డబ్బును ఆటగాళ్లకు ప్రోత్సాహకంగా అందించారు. అప్పటి నుంచి దేశంలోని ఏ క్రికెట్ స్టేడియంలో మ్యాచ్ జరిగినా లతా దీదీకి రెండు సీట్లు రిజర్వ్ చేయడం బీసీసీఐ అనవాయితీగా పెట్టుకుంది!