Hardik Pandya: వన్డే వరల్డ్ కప్లో భారత జట్టు తరఫున ట్రంప్ కార్డు అవుతాడనుకున్న స్టార్ ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యా.. నాలుగు మ్యాచ్లు ఆడాక గాయంతో వెనుదిరిగిన విషయం తెలిసిందే. గాయం తీవ్రత దృష్ట్యా బీసీసీఐ అతడిని వరల్డ్ కప్తో పాటు ఇటీవలే ఆస్ట్రేలియాతో ముగిసిన ఐదు మ్యాచ్ల సిరీస్లో కూడా ఆడించలేదు. రాబోయే దక్షిణాఫ్రికా, అఫ్గానిస్తాన్ సిరీస్లలోనూ పాండ్యా ఆడటం లేదు. అన్నీ కుదిరితే అతడు వచ్చే ఏడాది జరుగబోయే ఐపీఎల్లో ఎంట్రీ ఇవ్వనున్నాడని సమాచారం. హార్ధిక్ ఎంట్రీ కోసం బీసీసీఐ భారీగా ప్లాన్ చేస్తున్నదని తెలుస్తున్నది. వచ్చే ఏడాది జరగాల్సి ఉన్న టీ20 వరల్డ్ కప్ నేపథ్యంలో బీసీసీఐ అతడికి 18 వారాల పాటు ప్రత్యేక శిక్షణా కార్యక్రమం ఏర్పాటు చేయనున్నది.
బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)లో హార్ధిక్ పాండ్యా ప్రత్యేక నిపుణుల సమక్షంలో 18 వారాల పాటు హై పర్ఫార్మెన్స్ ప్రోగ్రాం పొందనున్నాడు. ఇదే విషయమై బీసీసీఐ ప్రతినిధి ఒకరు స్పందిస్తూ.. ‘పనిభారాన్ని తగ్గించే క్రమంలో ఇలాంటి నిర్ణయాలు సహజమే. టీ20 క్రికెటర్గా పాండ్యా సామర్థ్యంపై మాకు ఎలాంటి సందేహమూ లేదు. కానీ దీర్ఘకాలంలో హార్ధిక్ సేవలను వినియోగించుకోవాలంటే మాత్రం అతడిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి..’ అని తెలిపాడు.
హార్ధిక్కు ఇవ్వబోయే శిక్షణ టీమిండియాకు ఇదే కొత్త కాదు. గతంలో స్టార్ ఆటగాళ్లు జస్ప్రిత్ బుమ్రా, శ్రేయస్ అయ్యర్, కెఎల్ రాహుల్ లకు కూడా బీసీసీఐ ఇదే ట్రైనింగ్ ఇప్పించింది. వచ్చే ఏడాది జులైలో అమెరికా, వెస్టిండీస్లలో జరిగే పొట్టి ప్రపంచకప్ నాటికి పాండ్యాను పూర్తిస్థాయిలో సిద్ధం చేయాలని బీసీసీఐ భావిస్తున్నది. అప్పటివరకు గాయాల బారిన పడకుండా ఉండేందుకే దక్షిణాఫ్రికా, అఫ్గానిస్తాన్ సిరీస్లలో అతడికి విశ్రాంతినిచ్చింది.