టీమిండియా క్రికెటర్ వృద్ధిమాన్ సాహాను ఒక ప్రముఖ జర్నలిస్టు బెదిరించారనే వార్త కొన్ని రోజుల క్రితం సంచలనంగా మారింది. తనను ఇంటర్వ్యూకు పిలిచిన జర్నలిస్టుకు రిప్లై ఇవ్వకపోవడంతో.. సదరు జర్నలిస్టు తనను ఎలా బెదిరించిందీ సాహా వెల్లడించాడు. జర్నలిస్టు తనకు పంపిన వాట్సాప్ మెసేజ్లను స్క్రీన్ షాట్ తీసి ట్విట్టర్లో షేర్ చేశాడు.
ఈ గొడవ తర్వాత సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, ఇర్ఫాన్ పఠాన్ సహా తదితరులు అందరూ సాహాకు మద్దతుగా నిలిచారు. ఆ జర్నలిస్టు పేరు చెప్పాని కోరారు. అయితే సాహా చెప్పలేదు. దీనిపై బీసీసీఐ ముగ్గురు సభ్యులతో కమిటీ వేసింది. ఈ కమిటీలో కమిటీలో బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా, ట్రెజరర్ అరుణ్ సింగ్ ధుమాల్, అపెక్స్ కౌన్సిల్ సహ్యుడు ప్రభ్తేజ్ సింగ్ భాటియా ఉన్నారు.
వీళ్ల దర్యాప్తులో ఆ జర్నలిస్టు ఎవరో సాహా వెల్లడించాడు. ‘‘మా విచారణ సందర్భంగా ఈ బెదిరింపులకు పాల్పడిన జర్నలిస్టు బోరియా మజుందార్ అని సాహా చెప్పారు. మజుందార్ బెదిరింపులకు పాల్పడినట్లు మేం కూడా భావిస్తున్నాం’’ అని బీసీసీఐ కమిటీ పేర్కొంది. ఈ క్రమంలోనే మజుందార్పై రెండేళ్ల నిషేధం విధిస్తున్నామని, ఐసీసీకి కూడా అతన్ని నిషేధించాలని లేఖ రాస్తామని బీసీసీఐ తెలిపింది.
మజుందార్కు వేసిన శిక్ష ప్రకారం.. రెండేళ్ల పాటు జాతీయ, అంతర్జాతీయ క్రికెట్ మ్యాచుల సమయంలో ప్రెస్ సభ్యుడిగా అతనికి ఎలాంటి అక్రిడేషన్ ఇవ్వరు. అలాగే భారత్లో రిజిస్టర్ అయిన ఏ ఆటగాడితోనూ ఇంటర్వ్యూలు తీసుకోవడంపై కూడా నిషేధం విధించారు. బీసీసీఐ, అలాగే సభ్య అసోసియేషన్లకు సంబంధించిన క్రికెట్ ఫెసిలిటీల్లోకి అతన్ని అనుమతించరు కూడా. ఈ మూడు శిక్షలతోపాటు అంతర్జాతీయ మ్యాచుల విషయంలో కూడా చర్యలు తీసుకోవాలని ఐసీసీకి లేఖ రాస్తామని బీసీసీఐ తెలిపింది.