కోల్కతా: షెడ్యూల్ ప్రకారమే దక్షిణాఫ్రికా పర్యటన కొనసాగుతుందని.. రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో వేచి చూద్దామని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ అన్నాడు. అయితే ఆటగాళ్ల భద్రత, ఆరోగ్యం తమ తొలి ప్రాధాన్యమని స్పష్టం చేశాడు. కరోనా వైరస్ కొత్త వేరియెంట్ ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో సఫారీ టూర్పై గంగూలీ స్పందిస్తూ.. ‘దక్షిణాఫ్రికాతో మొదటి టెస్ట్ డిసెంబర్ 17న ఉంది. ఈ పర్యటనపై సమాలోచన చేస్తున్నాం. అక్కడి పరిస్థితులను నిశితంగా గమనిస్తున్నాం. ఆటగాళ్ల భద్రత, ఆరోగ్యం మా తొలి ప్రాధాన్యం.. దానికోసం ఏం చేయడానికైనా సిద్ధం’ అని తెలిపాడు. ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా ఫామ్పై స్పందిస్తూ.. ‘అతడు మంచి క్రికెటర్. ప్రస్తుతం ఫిట్గా లేకపోవడంతోనే జట్టులో లేడు. అతడికి ఇంకా వయసుంది. గాయం తగ్గాక తిరిగి వస్తాడని ఆశిస్తున్నా’ అని చెప్పాడు.