BBL 2024: ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న బిగ్బాష్ లీగ్ (బీబీఎల్)లో భాగంగా ఆదివారం మెల్బోర్న్ రెనిగేడ్స్ వర్సెస్ పెర్త్ స్కాచర్స్ మధ్య జరగాల్సిన మ్యాచ్ రద్దు అయింది. ఈ మ్యాచ్ కోసం సిద్ధం చేసిన పిచ్ ఆటగాళ్లకు ప్రమాదకరంగా ఉందనే కారణంగా అంపైర్లు ఆటను అర్థాంతరంగా రద్దు చేశారు. పెర్త్ స్కాచర్స్ జట్టు బ్యాటింగ్ చేస్తుండగా ఈ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది.
వివరాళ్లోకెళ్తే.. పెర్త్ స్కాచర్స్ జట్టు బ్యాటింగ్ చేస్తుండగా బంతి అనూహ్యంగా బౌన్స్ అవడం గమనించిన బ్యాటర్లు పరిస్థితిని అంపైర్లకు వివరించారు. ఆట మొదలై ఆరో ఓవర్ వేసిన విల్ సదర్లాండ్ బౌలింగ్లో వికెట్ కీపర్ బ్యాటర్ జోష్ ఇంగ్లిస్ బ్యాటింగ్ చేస్తుండగా బంతి అనుకున్నదానికంటే ఎక్కువ బౌన్స్ కావడంతో అతడు ఆన్ఫీల్డ్ అంపైర్ దృష్టికి తీసుకెళ్లాడు. దీంతో అంపైర్లు.. ఇరు జట్ల సారథులతో చర్చించి మ్యాచ్ను అర్థాంతరంగా రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు.
మ్యాచ్ జరుగుతున్న గీలాంగ్ లోని సిమండ్స్ స్టేడియం పరిసర ప్రాంతాల్లో శనివారం రాత్రి వర్షం కురిసింది. గ్రౌండ్లో కవర్లు కప్పిఉంచినా బంతి మాత్రం అధికంగా బౌన్స్ అవుతుండటంతో ఇది ఆటగాళ్లకు ప్రమాదకరంగా మారే అవకాశాలుండటంతో ఇరు జట్ల సారథులతో చర్చించి అంపైర్లు ఈ నిర్ణయం తీసుకున్నారు. మ్యాచ్ నిలిచిపోయే సమయానికి పెర్త్ స్కాచర్స్.. 6.5 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 30 పరుగులు చేసింది.
Big Bash match between Melbourne Renegades vs Perth Scorcher has been suspended due to “unsafe pitch”.pic.twitter.com/skeXVbGeWn
— Johns. (@CricCrazyJohns) December 10, 2023
అంతర్జాతీయ క్రికెట్లో…
అన్సేఫ్ పిచ్ కారణంగా మ్యాచ్ రద్దు కావడం ఇదే తొలిసారి కాదు. అంతర్జాతీయ క్రికెట్లో కూడా పలుమార్లు ఇలా జరిగింది. 1998లో ఇంగ్లండ్-వెస్టిండీస్ మధ్య సబీనా పార్కు (జమైకా) వేదికగా జరిగిన టెస్టులో 11 ఓవర్ల ఆట తర్వాత ఇలాంటి కారణంతోనే మ్యాచ్ రద్దు అయింది. 2007లో కూడా భారత్ – శ్రీలంక మధ్య ఢిల్లీలో జరిగిన వన్డే మ్యాచ్ కూడా అన్సేఫ్ పిచ్ కారణంగా అంపైర్లు ఆటను నిలిపేశారు.