Bazball: భారత పర్యటనలో భాగంగా వైజాగ్ వేదికగా సోమవారం ముగిసిన రెండో టెస్టులో నాలుగో ఇన్నింగ్స్లో 399 పరుగుల ఛేదనలో 292 పరుగులకే ఆలౌట్ అయి భారీ పరాభవాన్ని మూటగట్టుకుంది. గడిచిన రెండేండ్లుగా బజ్బాల్ ఆటతో స్వదేశంతో పాటు విదేశాల్లోనూ మెరుపులు మెరిపిస్తున్న ఆ జట్టు.. భారత్లో కూడా అదే దూకుడును ప్రదర్శిస్తున్నది. హైదరాబాద్ టెస్టులో అద్భుత ఆటతో నెగ్గిన ఆ జట్టు వైజాగ్లో మాత్రం ఆ మ్యాజిక్ను రిపీట్ చేయలేకపోయింది. విశాఖపట్నంలో బెన్ స్టోక్స్ సేన ఓటమితో ఇంగ్లండ్ దిగ్గజ ఆటగాడు జెఫ్రీ బాయ్కాట్.. ఇంగ్లీష్ టీమ్పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. బజ్బాల్ అనేది ఓ అట్టర్ ప్లాఫ్ అని ఇదే ఆటతీరుతో స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరిగిన యాషెస్ సిరీస్లో ఓడినా ఆ జట్టు గుణపాఠం నేర్చుకోలేదని బాయ్కాట్ ఘాటుగా స్పందించాడు.
వైజాగ్ టెస్టు తర్వాత టెలిగ్రాఫ్కు రాసిన ఓ వ్యాసంలో బాయ్కాట్ స్పందిస్తూ… ‘హెడ్కోచ్ బ్రెండన్ మెక్కల్లమ్, కెప్టెన్ బెన్ స్టోక్స్లు ఎప్పుడూ దూకుడు దూకుడు దూకుడు అని పరితపిస్తున్నారు. టెస్టులను జనరంజకం చేస్తున్నామని చెప్పుకుంటున్న వాళ్లు కొన్ని మ్యాచ్లు ఓడిపోయినా ఫర్వాలేదని అంటున్నారు. కానీ ఓడిపోతే కీర్తి ఎలా వస్తుంది..? బజ్బాల్ ఆటతీరు గొప్ప ఎంటర్టైనరే కావొచ్చు. కానీ అన్ని సందర్బాల్లో అదే ఆట కుదరదు. ఇవాళ ఇంగ్లండ్ మ్యాచ్ను వదిలేసింది. బజ్బాల్ ఒక ఫెయిల్యూర్ అని మరోసారి నిరూపితమైంది..’అని పేర్కొన్నాడు. గతేడాది యాషెస్ సందర్భంగా బాయ్కాట్ ఇంగ్లండ్ టీమ్పై ఇవే తరహా వ్యాఖ్యలు చేసిన విషయం విదితమే. బజ్బాల్ ఆటతీరుపై ఆయన మొదట్నుంచీ విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు.
We fall short in our chase in Vizag
Match Centre: https://t.co/tALYxvMByx
🇮🇳 #INDvENG 🏴 | #EnglandCricket pic.twitter.com/yxujHkR3Gd
— England Cricket (@englandcricket) February 5, 2024
రెండో టెస్టు నాలుగో ఇన్నింగ్స్లో 400 పరుగుల ఛేదనలో కనీసం ఒక్క బ్యాటర్ అయినా సెంచరీ కంటే ఎక్కువ పరుగులు చేసి ఉండాల్సిందని కానీ ఇంగ్లండ్ మాత్రం అలా చేయక మూల్యం చెల్లించుకుందని బాయ్కాట్ వివరించాడు. బజ్బాల్ మాయలో పడ్డ ఇంగ్లండ్ కామన్సెన్స్తో ఆడటం మరిచిపోయిందని, ఎప్పుడు అటాక్ చేయాలో ఎప్పుడు డిఫెండ్ చేయాలనేది టెస్టులలో కీలకమని బాయ్కాట్ రాసుకొచ్చాడు.
ఐదు మ్యాచ్ల సిరీస్లో భాగంగా హైదరాబాద్లో ముగిసిన తొలి టెస్టులో ఇంగ్లండ్ గెలవగా వైజాగ్ టెస్టులో భారత్ గెలిచింది. తద్వారా సిరీస్ను 1-1 తో సమం చేసింది. ఇరు జట్ల మధ్య మూడో టెస్టు ఈనెల 15 నుంచి రాజ్కోట్ వేదికగా మొదలుకానుంది.