Temba Bavuma : భారత్, దక్షిణాఫ్రికాల మధ్య రెండు టెస్టుల సిరీస్కు కౌంట్డౌన్ మొదలైంది. సెంచూరియన్లో ఇరుజట్ల మధ్య రేపు బాక్సింగ్ డే టెస్టు (Boxing Day Test) జరుగనుంది. ప్రపంచ టెస్టు చాంపియన్షిప్(WTC 2023-25)లో కీలకమైన ఈ సిరీస్ ఆరంభానికి ముందు దక్షిణాఫ్రికా సారథి తెంబా బవుమా(Temba Bavuma) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సొంతగడ్డపై ఆడుతున్నా కూడా తమకు భారత బౌలర్లతో కష్టాలు తప్పకపోవచ్చని బవుమా అన్నాడు.
‘సొంతగడ్డపై ఆడుతున్నందున ఇక్కడి పరిస్థితులపై మాకు అవగాహన ఎక్కువ. కానీ, భారత బౌలింగ్ యూనిట్ బలంగా ఉంది. స్వదేశంలో మాకున్న బలాన్ని ఇండియన్ బౌలర్లు దెబ్బతీయగలరు. బౌన్సీ పిచ్లపై వాళ్లను ఎదుర్కోవడం మాకు పెద్ద సవాలే. ఇప్పటివరకూ షమీతోనే ముప్పు అనుకున్నాం. కానీ, అతడి స్థానంలో ఆడే బౌలర్ మమ్మల్ని మరింత ఒత్తిడిలోకి నెడతాడు’ అని బవుమా అన్నాడు. సఫారీ టూర్లో టీ20 సిరీస్(T20 Series) సమం చేసిన భారత్.. వన్డే సిరీస్ ఛేజిక్కించుకుంది. అదే ఊపులో టెస్టు సిరీస్లోనూ ప్రొటీస్ జట్టును మట్టకిరిపించాలని టీమిండియా పట్టుదలతో ఉంది.
సఫారీ పర్యటనలో టెస్టు సిరీస్ మాత్రం టీమిండియాను అందని ద్రాక్షలా ఊరిస్తోంది. 1992 నుంచి ఏడుసార్లు దక్షిణాఫ్రికా గడ్డపై టెస్టు సిరీస్ ఆడిన భారత్ ఆరుసార్లు ఓటమి పాలైంది. 2011లో జరిగిన సిరీస్ డ్రా చేసుకుంది. దాంతో ఈసారి సుదీర్ఘ ఫార్మాట్లో అద్బుతం చేయాలని రోహిత్ శర్మ(Rohit Sharma) సారథ్యంలోని భారత్ అస్త్రశస్త్రాలు సిద్దం చేసుకుంటోంది. అందులో భాగంగా రోహిత్, విరాట్ కోహ్లీ ఆదివారం నెట్స్లో చెమటోడ్చారు. కుర్రాళ్లు శుభ్మన్ గిల్, యశస్వీ జైస్వాల్ సూపర్ ఫామ్లో ఉండడంతో పాటు బౌలింగ్లో బుమ్రా, అశ్విన్, జడ్డూ రాణిస్తుండడంతో భారత జట్టు గెలుపుపై ధీమాతో ఉంది.