IND vs WI | గత రెండు మ్యాచ్ల్లో పేలవ ప్రదర్శనతో విమర్శలు ఎదుర్కొన్న టీమ్ఇండియా మూడో వన్డేలో దంచికొట్టింది. ఓపెనర్లు ఇషాన్ కిషన్, శుభ్మన్ గిల్ జట్టుకు గట్టి పునాది వేయగా.. కెప్టెన్ హార్దిక్ పాండ్యా, సంజూ శాంసన్, సూర్యకుమార్ యాదవ్ సమిష్టిగా సత్తాచాటి.. దానిపై భారీ పరుగుల సౌధాన్ని నిర్మించారు. వరుసగా రెండో మ్యాచ్లోనూ రోహిత్, కోహ్లీకి రెస్ట్ ఇవ్వగా.. దశాబ్ద కాలం తర్వాత జైదేవ్ ఉనాద్కట్ వన్డే జట్టులో చోటు దక్కించుకున్నాడు.
టరోబా: తొలి వన్డేలో స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు ఐదు వికెట్లు కోల్పోయి.. అపవాదు మూటగట్టుకున్న యంగ్ఇండియా.. రెండో మ్యాచ్లో కరీబియన్ల చేతిలో ఘోర పరాజయం చవిచూసింది. అయినా ప్రయోగాలకే పెద్దపీట వేస్తామన్న కోచ్ రాహుల్ ద్రవిడ్ యువ ఆటగాళ్లకే మరోసారి అవకాశమివ్వగా.. ట్రినిడాడ్లో జరిగిన మూడో వన్డేలో భారత టాపార్డర్ రాణించింది. మంగళవారం జరిగిన నిర్ణయాత్మక పోరులో భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 351 పరుగులు చేసింది. విండీస్ పర్యటనలో పెద్దగా ఆకట్టుకోలేక విమర్శలు ఎదుర్కొన్న యువ ఓపెనర్ శుభ్మన్ గిల్ (92 బంతుల్లో 85; 11 ఫోర్లు) టాప్ స్కోరర్ కాగా.. మరో ఓపెనర్ ఇషాన్ కిషన్ (64 బంతుల్లో 77; 8 ఫోర్లు, 3 సిక్సర్లు), సంజూ శాంసన్ (41 బంతుల్లో 51; 2 ఫోర్లు, 4 సిక్సర్లు), కెప్టెన్ హార్దిక్ పాండ్యా (52 బంతుల్లో 70 నాటౌట్; 4 ఫోర్లు, 5 సిక్సర్లు) హాఫ్ సెంచరీలతో రాణించారు. ఈ మ్యాచ్లో అవకాశం దక్కించుకున్న రుతురాజ్ గైక్వాడ్ (8) ఒక్కడే విఫలం కాగా.. ఆరో స్థానంలో బ్యాటింగ్కు వచ్చిన సూర్యకుమార్ యాదవ్ (30 బంతుల్లో 35; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) పర్వాలేదనిపించాడు. విండీస్ బౌలర్లలో షెఫర్డ్ 2, జోసెఫ్, మోతి, యానిక్ తలా ఒక వికెట్ పడగొట్టారు. భారీ లక్ష్యఛేదనలో కడపటి వార్తలు అందేసరికి వెస్టిండీస్ 9 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 28 పరుగులు చేసింది. ముఖేశ్కు 3 వికెట్లు దక్కాయి.
ఓపెనింగ్ అదుర్స్
వన్డే ప్రపంచకప్ సన్నాహకాల్లో భాగంగా జరుగుతున్న ఈ సిరీస్లో ఇప్పటి వరకు పెద్దగా ప్రభావం చూపలేకపోయిన మనవాళ్లు చివరి పోరులో దుమ్మురేపారు. టాస్ గెలిచి విండీస్ బౌలింగ్ ఎంచుకోవడంతో.. మొదట బ్యాటింగ్కు దిగిన యంగ్ఇండియా ఆరంభం నుంచే ఆకట్టుకుంది. గత రెండు మ్యాచ్లకు భిన్నంగా ఓపెనర్లు సాధికారతతో ఆడగా.. శుభ్మన్ గిల్ తిరిగి లయ అందుకున్నాడు. ఎడాపెడా బౌండ్రీలతో విరుచుకుపడిన ఇషాన్ కిషన్ వరుసగా మూడో మ్యాచ్లో హాఫ్ సెంచరీ మార్క్ (43 బంతుల్లో) అందుకోగా.. కాసేపటికి 51 బంతుల్లో గిల్ ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. తొలి వికెట్కు 143 పరుగులు జోడించాక ఇషాన్ పెవిలియన్ చేరగా.. రుతురాజ్ గైక్వాడ్ ఇలా వచ్చి అలా వెళ్లాడు. ప్రతిభకు కొదువలేకున్నా.. వచ్చిన అవకాశాలను సద్వినియోగ పర్చుకోలేక జాతీయ జట్టులో చోటు కోల్పోతూ వస్తున్న సంజూ శాంసన్ ఈ మ్యాచ్లో ధాటిగా ఆడాడు. బౌండ్రీల కంటే ఎక్కువ సిక్సర్లపైనే దృష్టిపెట్టిన ఈ కేరళా వికెట్కీపర్ భారీ షాట్లతో స్టేడియాన్ని హోరెత్తించాడు. సంజూ, గిల్ ధాటిగా ఆడుతుండటంతో 28.2 ఓవర్లలోనే భారత స్కోరు 200 దాటింది. దీంతో మరింత భారీ స్కోరు చేయడం ఖాయమే అనుకుంటుంటే.. హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న వెంటనే సులువైన క్యాచ్ ఇచ్చి శాంసన్ పెవిలియన్ చేరాడు. సెంచరీ చేసేలా కనిపించిన గిల్ కూడా ఔట్ కాగా.. సూర్యకుమార్తో కలిసి హార్దిక్ ఇన్నింగ్స్ను ముందుకు నడిపాడు. మైదానం నలువైపులా షాట్లు ఆడటంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. సూర్యా ఔటైనా.. పాండ్యా దంచుడు కొనసాగించడంతో టీమ్ఇండియా భారీ స్కోరు చేసింది. ఇన్నింగ్స్ చివరి ఓవర్లో పాండ్యా 18 పరుగులు రాబట్టడం విశేషం.