హైదరాబాద్, ఆట ప్రతినిధి: ట్యునిషియా అంతర్జాతీయ టోర్నీకి రాష్ర్టానికి చెందిన యువ టేబుల్ టెన్నిస్ ప్లేయర్ బల్సురి వరుణ్ శంకర్ ఎంపికయ్యాడు. గత కొన్నేండ్లుగా జాతీయ స్థాయిలో నిలకడగా రాణిస్తున్న శంకర్..తొలిసారి భారత్కు ప్రాతినిధ్యం వహించబోతున్నాడు. ప్రస్తుత ర్యాంకింగ్స్ను పరిగణనలోకి తీసుకున్న జాతీయ టేబుల్ టెన్నిస్ సమాఖ్య (టీటీఎఫ్ఐ) శంకర్ను ఎంపిక చేస్తున్నట్లు ప్రకటించింది. ఆకుల శ్రీజ, ఎస్ఎఫ్ఆర్ స్నేహిత్ తర్వాత రాష్ట్రం నుంచి అంతర్జాతీయ టోర్నీలో బరిలోకి దిగుతున్న మూడో ప్లేయర్గా శంకర్ నిలిచాడు. తన ఎంపికపై ఈ యువ ప్యాడ్లర్ స్పందిస్తూ చాలా సంతోషంగా ఉందని, భారత జెర్సీ ధరించి ఆడటం గర్వకారణమన్నాడు. ఈ సందర్భంగా రాష్ట్ర టీటీ అసోసియేషన్ ప్రతినిధులతో పాటు తన కోచ్ సోమ్నాథ్ ఘోష్కు శంకర్ కృతజ్ఞతలు తెలిపాడు.