అడిలైడ్: టీ20 వరల్డ్కప్లో బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో ఇండియా ఉత్కంఠ విజయాన్ని నమోదు చేసిన విషయం తెలిసిందే. కేవలం అయిదు పరుగుల తేడాతో ఆ మ్యాచ్ను భారత్ సొంతం చేసుకున్నది. అయితే ఆ మ్యాచ్లో కీలక ఇన్నింగ్స్ ఆడిన కోహ్లీ హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. ఇక ఛేజింగ్ సమయంలో కోహ్లీ ఫేక్ ఫీల్డింగ్ చేశారంటూ బంగ్లాదేశ్ క్రికెటర్ నురుల్ ఆరోపించాడు. ఆన్ఫీల్డ్ అంపైర్లు కూడా కోహ్లీ ఫేక్ ఫీల్డింగ్ను గుర్తించలేదని నురుల్ పేర్కొన్నాడు.
#INDvsBAN is this considered fake fielding? pic.twitter.com/rwLaPwv3xs
— Siddharth (@siddyhere1) November 3, 2022
కోహ్లీ మోసపూరితమైన ఆట ఆడాడని, ఏడో ఓవర్లో కోహ్లీ ఫేక్ ఫీల్డింగ్ చేశాడని, ఒకవేళ అంపైర్లు సరిగ్గా పరిశీలించి ఉంటే, తమకు అదనంగా అయిదు పరుగులు వచ్చేవని, ఒకవేళ ఆ రన్స్ వస్తే తాము మ్యాచ్ గెలిచేవాళ్లమని నురుల్ అన్నాడు. క్రిస్ బ్రౌన్, మారైస్ ఎరాస్మాస్ అంపైరింగా బాగాలేదని ఆరోపించాడు.
అక్షర్ బౌలింగ్లో లిటన్ దాస్ డీప్ స్క్వేర్ దిశగా కట్ షాట్ ఆడాడు. డీప్లో ఫీల్డింగ్ చేస్తున్న హర్షదీప్ బంతిని అందుకుని కీపర్ వైపు విసిరాడు. అయితే పాయింట్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న కోహ్లీ.. ఆ బంతిని అందుకున్నట్లు సంకేతం ఇస్తూ.. నాన్ స్ట్రయికర్ ఎండ్ వైపు విసిరినట్టు చేశాడు. నిజానికి కోహ్లీ ఆ బంతిని పట్టుకోలేదు. ఆ బాల్ నేరుగా కీపర్ వద్దకు వెళ్లింది. కానీ ఈలోగా లిటన్ రెండు రన్స్ తీశాడు. ఫీల్డర్గా కోహ్లీ ప్రవర్తించిన తీరు సరిగా లేదని, తమకు అయిదు పెనాల్టీ రన్స్ ఇవ్వాల్సి ఉందని నురుల్ ఆరోపించాడు.
అంపైర్లపై ఆరోపణలు చేసిన నురుల్పై ఐసీసీ అధికారులు చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి.