Shakib al Hasan | భారత్ – బంగ్లాదేశ్ మధ్య గురువారం పూణె వేదికగా జరగాల్సి ఉన్న మ్యాచ్లో బంగ్లా సారథి షకిబ్ అల్ హసన్ ఆడతాడా..? ఇటీవలే న్యూజిలాండ్ తో ముగిసిన మ్యాచ్లో కండరాల గాయంతో బాధపడ్డ షకిబ్.. భారత్తో మ్యాచ్లో ఆడేదీ లేనిది అనుమానంగానే ఉంది. వరల్డ్ నెంబర్ వన్ ఆల్ రౌండర్గా ఉన్న షకిబ్ లేకుంటే భారత్తో మ్యాచ్లో బంగ్లా సగం బలం కోల్పోయినట్టే. ఈ నేపథ్యంలో బంగ్లా టీమ్ డైరెక్టర్, మాజీ సారథి ఖలీద్ మహ్మద్ సుజోన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
ఖలీద్ స్పందిస్తూ..‘షకిబ్ ప్రస్తుతం కోలుకుంటున్నాడు. ఇప్పుడైతే అతడు గాయం నుంచి పూర్తిగా కోలుకున్నాడు. కానీ అతడు మ్యాచ్ వరకు పూర్తి ఫిట్నెస్ సాధించగలుగుతాడా..? లేదా..? అన్నది ఇంకా తేలాల్సి ఉంది. బౌలింగ్ ఒక్కటే కాదు. అతడు బ్యాటింగ్తో వికెట్ల మధ్య పరుగెత్తాలి. షకిబ్ స్విమ్మింగ్ తో పాటు జిమ్ సెషన్ లో మెరుగ్గానే కనిపించాడు. అతడికి మరో స్కాన్ చేయాల్సి ఉంది. స్కాన్ రిజల్ట్స్ వచ్చాక షకిబ్ పరిస్థితిపై నిర్ణయం తీసుకుంటాం..’ అని మంగళవారం రాత్రి నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెస్లో వెల్లడించాడు.
🚨 It has been 2 days since Shakib Al Hasan underwent a scan. But BCB didn’t reveal the scan report yet. #CWC23
— Saif Ahmed 🇧🇩 (@saifahmed75) October 16, 2023
గురువారం భారత్తో జరుగబోయే మ్యాచ్ బంగ్లాకు చాలా కీలకం. ఇదివరకే టోర్నీలో ఆడిన మూడు మ్యాచ్లలో ఒకటి గెలిచి రెండు ఓడిన బంగ్లాదేశ్.. గురువారం భారత్ కు షాకివ్వాలని భావిస్తున్నది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో ఉన్న బంగ్లాదేశ్.. అఫ్గానిస్తాన్, నెదర్లాండ్స్ ఇచ్చిన స్ఫూర్తితో భారత్కు ఝలక్ ఇచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.