బంగ్లాదేశ్ టెస్టు సారథ్య బాధ్యతల నుంచి మోమినుల్ హక్ వైదొలగడంతో ఆ స్థానాన్ని వెటరన్ షకిబ్ అల్ హసన్ కు అప్పజెప్పింది బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ). వరుస పరాజయాలతో విసిగిపోయిన మోమినుల్ హక్.. రెండ్రోజుల క్రితమే తన బాధ్యతల నుంచి వైదొలిగుతున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బీసీబీ.. తిరిగి మాజీ కెప్టెన్ షకిబ్ అల్ హసన్ కే కెప్టెన్సీ పగ్గాలను అప్పజెప్పింది. లిటన్ దాస్ ను వైస్ కెప్టెన్ గా నియమించింది.
కాగా షకిబ్ కు టెస్టు కెప్టెన్సీ ఇవ్వడం ఇదే మొదటిసారి కాదు. గతంలో 2009 లో కూడా 2009, 2017-19 వరకు కూడా కెప్టెన్ గా పనిచేశాడు. కానీ 2019 లో అతడిపై ఐసీసీ నిషేధం విధించడంతో అతడు సారథి గా తప్పుకోవాల్సి వచ్చింది. ఇక ఇప్పుడు మోమినుల్ హక్ అనూహ్యంగా తప్పుకోవడంతో జట్టులో సీనియర్ ప్లేయర్ గా ఉన్న షకిబ్ నే బీసీబీ కెప్టెన్ గా నియమించింది.
మరోవైపు 2019 నుంచి మోమినుల్ హక్ బంగ్లాదేశ్ టెస్టు జట్టుకు కెప్టెన్ గా ఉన్నాడు. అతడి హయాంలో బంగ్లా టెస్టులలో మరింత బలహీనపడిందే గానీ విజయాలు సాధించిందేమీ లేదు. కెప్టెన్ గా 17 టెస్టులకు సారథ్యం వహించిన అతడు.. 3 మ్యాచులు మాత్రమే గెలిచాడు. 12 మ్యాచులలో ఓడాడు. రెండు టెస్టులు డ్రా అయ్యాయి. ఈ ఏడాది దక్షిణాఫ్రికా తో పాటు శ్రీలంక తో జరిగిన టెస్టు సిరీస్ లలో బంగ్లా ఓడటంతో మోమినుల్.. కెప్టెన్ గా వైదొలగాలనే నిర్ణయం తీసుకున్నాడు. కెప్టెన్ గా ప్రభావం చూపకపోగా మోమినుల్ బ్యాటింగ్ లో ఫామ్ కూడా కోల్పోయి తీవ్ర విమర్శలు ఎదుర్కున్నాడు. ఈ నేపథ్యంలో ఇటీవలే అతడు బంగ్లా టెస్టు సారథ్య బాధ్యతలకు గుడ్ బై చెప్పాడు.