ఢాకా : సొంతగడ్డపై న్యూజిలాండ్తో మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ ఆడుతున్న బంగ్లాదేశ్.. తొలి వన్డేలో ఓడినా సోమవారం జరిగిన రెండో మ్యాచ్లో మాత్రం సత్తాచాటింది. కివీస్ను ఆ జట్టు 6 వికెట్ల తేడాతో చిత్తుచేసి సిరీస్ను 1-1తో సమం చేసింది. మొదట బంగ్లా బౌలర్లు పర్యాటక జట్టును 48.4 ఓవర్లలో 198 పరుగులకే కట్టడిచేశారు. నహిద్ రాణా (5/32) తన కెరీర్లో రెండోసారి ఐదు వికెట్ల ప్రదర్శన చేయగా షోరిఫుల్ ఇస్లాం (2/32) రాణించాడు.
కివీస్ తరఫున నిక్ కెల్లీ (83) మినహా మిగిలినవారిలో ఒక్క బ్యాటర్ కూడా 20 పరుగుల మార్కును అందుకోలేకపోయారు. స్వల్ప ఛేదనను ఆతిథ్య జట్టు 35.3 ఓవర్లలో 4 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయం సాధించింది. తాంజిద్హసన్ తమిమ్ (76), నజ్ముల్ హోసేన్ శాంతో (50), తౌహిద్ హృదయ్ (30 నాటౌట్) ఆ జట్టు గెలుపులో కీలకపాత్ర పోషించారు. ఇరుజట్ల మధ్య సిరీస్ విజేతను నిర్ణయించే మూడో వన్డే ఈనెల 23న చత్తోగ్రమ్లో జరుగుతుంది.