ఉత్తరాఖండ్ క్రికెట్ అసోసియేషన్ (సీఏయూ) లో అవినీతి రాజ్యమేలుతున్నది. అడిగేవారు లేక సీఏయూలో పాలక మండలి ఇష్టారీతిన వ్యవహరిస్తున్నది. సీఏయూ ఆడిట్ రిపోర్టు-2020 లో సంచలన విషయాలు బయటకు వచ్చాయి. ఆటగాళ్లకు జీతాలివ్వడానికి మీనమేషాలు లెక్కిస్తున్న సీఏయూ పెద్దలు.. అవినీతి, అక్రమాలకు మాత్రం గేట్లు బార్లా తెరిచారు.
2020 లో క్రికెటర్ల కోసం అరటిపండ్లకు రూ. 35 లక్షలు… వాటర్ బాటిల్స్ కు రూ. 22 లక్షలు ఖర్చు చేసినట్టు లెక్కల్లో చూపించింది సీఏయూ. ఆటగాళ్లకు ట్రైనింగ్ క్యాంప్ లు ఏర్పాటు చేయకున్నా.. వాటిని నిర్వహించినట్టు లెక్కల్లో చూపి లక్షల రూపాయలు దండుకుంటున్నారని పలువురు క్రికెటర్లు ఆరోపిస్తున్నారు.
2020కి గాను రూ. 1,74,07,346 ఆటగాళ్ల ఫుడ్, కేటరింగ్ కోసం ఖర్చుచేయగా.. రూ. 49,58,750 లను డైలీ అలవెన్సుల కింద చూపారు. ఇందులోనే వాటర్ బాటిళ్లు, అరటిపండ్ల ఖర్చును కూడా చూపించారు. ఇక్కడ ఇంకో విస్మయపరిచే విషయమేమిటంటే.. విజయ్ హజారే, రంజీ ట్రోఫీలు ఆడుతున్నప్పుడు ఆటగాళ్లు వచ్చి భోజనం గురించి అడిగితే స్విగ్గీలో ఆర్డర్ ఇచ్చుకుని తినమని చెప్పేదట సీఏయూ అధికారులు. కానీ లెక్కల్లో మాత్రం వాటికోసం భారీగా ఖర్చు చేశామని చూపడం గమనార్హం.
ఇక ఎవరైనా క్రికెటర్లు బోర్డులో అవినీతి, అక్రమాలపై ప్రశ్నిస్తే వారిని జట్టులోంచి తప్పించడం.. నోర్మూసుకోకుంటే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించడం వంటివి చేసేవారని పలువురు ఆటగాళ్లు వాపోతున్నారు. అక్రమాలపై నిలదీసి అడిగేవారిని చంపుతామని కూడా బెదిరించిన సందర్భాలూ ఉన్నాయి. ఆ రాష్ట్రం తరఫున అండర్-19 ఆడిన ఆర్యా సేథికి ఇలాంటి అనుభవమే ఎదురైందట. దీంతో అతడి తండ్రి వీరేంద్ర సేథి డెహ్రాడూన్ లోని వసంత విహార్ పోలీస్ స్టేషన్ లో సీఏయూ సెక్రెటరీ మహిమ్ వర్మ, జట్టు హెడ్ కోచ్ మనీష్ ఝా, అసోసియేషన్ స్పోక్స్ పర్సన్ సంజయ్ గుసాయిన్ లపై ఫిర్యాదు చేశాడు. ఉత్తరాఖండ్ పోలీసులు వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి వారిని మూడు రోజుల పాటు విచారించారని డెహ్రాడూన్ ఎస్ఎస్పీ జనమేజయ ఖందూరి తెలిపాడు.