BAN vs IND : రెండో టెస్టులో మిడిలార్డర్ రాణించడంతో భారత్ ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. అయితే.. సెంచరీకి చేరువగా వచ్చిన శ్రేయస్ అయ్యర్ కూడా 87 పరుగుల వద్ద వెనుదిరిగాడు. అతను షకిబుల్ హసన్ బౌలింగ్లో ఎల్బీగా అవుట్ అయ్యాడు. రిషభ్ పంత్, శ్రేయాస్ అయ్యర్ జోడీ లంచ్, టీ బ్రేక్ సెషనల్లో వేగంగా పరుగులు రాబట్టింది. ఒత్తిడిలోనూ అద్భుతంగా ఆడిన రిషభ్ పంత్ తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. మెహిదీ హసన్ మిరాజ్93 పరుగుల వద్ద పంత్ను అవుట్ చేశాడు. పంత్ 90ల్లో వికెట్ సమర్పించుకోవడం ఇది ఆరోసారి. ఆ తర్వాత వచ్చిన అక్షర్ పటేల్ 4 పరుగులకే షకిబుల్ హసన్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. శాంటో క్యాచ్ పట్టడంతో అక్షర్ నిరాశగా వెనుదిరిగాడు. ప్రస్తుతం 44 పరుగుల ఆధిక్యంలో ఉంది. రవిచంద్రన్ అశ్విన్, ఉనాద్కత్ క్రీజులో ఉన్నారు. ఆఖరి సెషన్లో మిరాజ్, షకిబుల్ హసన్ కీలకమైన పంత్, అక్షర్, శ్రేయాస్ అయ్యార్ వికెట్లు తీసి భారత్ను దెబ్బతీశారు. తైజుల్ ఇస్లాం 3 వికెట్లు పడగొట్టాడు.
పంత్-శ్రేయాస్ జోరు
ఓపెనర్లు శుభ్మన్ గిల్ (20), కేఎల్ రాహుల్ (10) వెంట వెంటనే పెవిలియన్ చేరారు. నయా వాల్ పూజారా (24)కూడా తొందరగానే వెనుదిరిగాడు. దాంతో కోహ్లీ , రిషభ్ పంత్తో కలిసి ఇన్నింగ్స్ నిర్మించే బాధ్యత తీసుకున్నాడు. పంత్ తనదైన శైలిలో బంగ్లా బౌలర్లపై విరుచుకు పడ్డాడు. కోహ్లీ 24 రన్స్ వద్ద అవుట్ అయ్యాడు. దాంతో శ్రేయాస్ అయ్యార్తో కలిసి స్కోర్ వేగం పెంచాడు. వీళ్లిద్దరు ఆరో వికెట్కు 150 పరుగులు చేయడంతో భారత్ ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత దూకుడుగా ఆడే క్రమంలో పంత్ వికెట్ పారేసుకున్నాడు.