పంతానికి దిగితే ప్రత్యర్థులను చిత్తుచేసే వరకు వదలని నైజం..అవతలి కోర్టులో పదిపైసల బిళ్ల పెడితే.. గురిచూసి కొట్టే నైపుణ్యం..అప్పటి వరకు కనీసం పేరు కూడా తెలియని క్రీడకు.. ఊరూరా బ్రహ్మరథం పట్టించిన సారథ్యం..బాల్ బ్యాడ్మింటన్ క్రీడలో అర్జున అవార్డు అందుకొన్న తొలి ఆటగాడిగా నిలిచిన ఘనచరితం..ఎందరో ఆటగాళ్లకు ఆది గురువు వంటి దిగ్గజ క్రీడాకారుడు జమ్మలమడక పిచ్చయ్య కన్నుమూశారు.దశాబ్దాలుగా బాల్ బ్యాడ్మింటన్ క్రీడకు అనధికారిక బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించిన తెలంగాణ క్రీడా శిఖరం ఆదివారం నేలకొరిగింది. ఇటీవలే 104వ పుట్టిన రోజు జరుపుకొన్న పిచ్చయ్య.. వృద్ధాప్య సమస్యలతో కన్నుమూశారు. ఇప్పుడంటే సచిన్ బ్యాట్.. కోహ్లీ బ్యాట్ అంటూ చిన్నపిల్లలు తమ క్రికెట్ బ్యాట్లు చూసి మురిసిపోతున్నారు కానీ.. ఒకతరానికి ‘పిచ్చయ్య బ్యాట్’ను మించింది లేదంటే అతిశయోక్తి కాదు!
పోచమ్మమైదాన్, డిసెంబర్ 26: బాల్ బ్యాడ్మింటన్ మాంత్రికుడు, అర్జున అవార్డీ జమ్మలమడక పిచ్చయ్య (104) కన్నుమూశారు. దేశంలో బాల్ బ్యాడ్మింటన్కు వన్నె తెచ్చిన పిచ్చయ్య వృద్ధాప్య సమస్యలతో ఆదివారం హనుమకొండ జిల్లా మడికొండలోని మనుమడి ఇంట్లో తుదిశ్వాస విడిచారు. ఆయన మృతికి రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్, సాట్స్ చైర్మన్ వెంకటేశ్వర్రెడ్డి, జాతీయ అథ్లెటిక్స్ కోచ్ నాగపురి రమేశ్, రిటైర్డ్ ఐఏఎస్ బీపీ ఆచార్యతో సహ పలువురు క్రీడాకారులు సంతాపం తెలిపారు. క్రీడాభివృద్ధికి ఆయన చేసిన సేవలను కొనియాడారు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు సుశీల, జానకీదేవి ఉన్నారు. 2007లో భార్య సత్యవతి మృతితో ఆయన మనుమడి నివాసంలో ఉండేవారు. ఈనెల 21న 104వ జన్మదిన వేడుకలను జరుపుకున్న ఐదు రోజులకే పిచ్చయ్య మృతి చెందారు.
నమస్తే తెలంగాణ క్రీడావిభాగం: సరదాగా మొదలుపెట్టిన బాల్ బ్యాడ్మింటన్లో అద్భుత విజయాలు సాధించిన పిచ్చయ్య 21 డిసెంబర్ 1918న ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా కూచిపూడి గ్రామంలో జన్మించారు. బందరులో ఎస్ఎస్ఎల్సీ పూర్తి చేసిన పిచ్చయ్య పదో తరగతి ఫెయిలైన అనంతరం అక్కడే స్థానికంగా ఉన్న మినర్వా క్లబ్, మోహన క్లబ్లో సరదాగా బాల్ బ్యాడ్మింటన్ ఆడటం మొదలుపెట్టారు. కొద్దిరోజుల్లోనే ఆ క్రీడలో విశేష నైపుణ్యం పొందారు. అనంతరం జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో రాణించారు. 1945లో వరంగల్ చేరుకున్న పిచ్చయ్య ఆజంజాహి వర్కర్స్ యూనియన్లో ఉద్యోగం పొంది అక్కడి నుంచే క్రీడాపోటీలకు హాజరయ్యేవారు. 1950లో తొలిసారి జాతీయస్థాయి పోటీలకు ఎంపికైనా.. ఆర్థిక ఇబ్బందులతో అందులో పాల్గొనలేకపోయారు. నాలుగేండ్ల అనంతరం 1954లో హైదరాబాద్ వేదికగా జరిగిన జాతీయస్థాయి పోటీల్లో జట్టును విజయపథాన నడిపించారు. అప్పటి నుంచి ఎన్నో విజయాలతో దేశీయ క్రీడకు విశేష గుర్తింపు తీసుకువచ్చారు. 1970లో భారత ప్రభుత్వం పిచ్చయ్య సేవలను గుర్తించి బాల్ బ్యాడ్మింటన్లో తొలి అర్జున అవార్డుతో సత్కరించింది.
1954లో హైదరాబాద్ వేదికగా జరిగిన జాతీయస్థాయి పోటీల్లో పాల్గొని జట్టు విజయంలో కీలకపాత్ర.
1956, 1957లో ఆనాటి మద్రాసు, పాండిచ్చేరిలో జరిగిన జాతీయ పోటీల్లో పిచ్చయ్య సారథ్యంలో జట్టు విజయం.
15 జాతీయస్థాయి పోటీల్లో కెప్టెన్గా వ్యవహరించిన పిచ్చయ్య అందులో తొమ్మిదింట జట్టును చాంపియన్గా నిలిపారు.
1972లో అప్పటి రాష్ట్రపతి వీవీ గిరి చేతులమీదుగా అర్జున అవార్డు స్వీకరణ.
అర్జున అవార్డీ పిచ్చయ్య మరణం క్రీడాలోకానికి తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని కోరుకుంటున్నా.