షా ఆలమ్: భారత మహిళల బ్యాడ్మింటన్ జట్టు.. సంచలన ప్రదర్శనతో ఆసియా టీమ్ చాంపియన్షిప్లో తొలిసారి పతకం ఖాయం చేసుకుంది. మలేషియా వేదికగా జరుగుతున్న మెగాటోర్నీలో పీవీ సింధు సారథ్యంలోని భారత జట్టు సెమీఫైనల్కు దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో భారత్ 3-0తో హాంకాంగ్పై విజయం సాధించింది. టైలో భాగంగా జరిగిన మహిళల సింగిల్స్ తొలి పోరులో రెండు ఒలింపిక్ పతకాలు సాధించిన సింధు 21-7, 16-21, 21-12తో లో సిన్ యాన్పై గెలిచి బోణీ కొట్టగా.. డబుల్స్ మ్యాచ్లో అశ్విని పొన్నప్ప-తనీషా జోడీ 21-10, 21-14తో యెంగ్ నెగా టింగ్-యెంగ్ లామ్ ద్వయంపై గెలుపొందింది. మరో సింగిల్స్ మ్యాచ్లో యువ షట్లర్ అష్మిత చలిహ 21-12, 21-13తో యెంగ్ సుమ్ యీపై నెగ్గింది. దీంతో ఈ టోర్నీలో తొలిసారి భారత మహిళల జట్టుకు కనీసం కాంస్య పతకం ఖాయమైంది. మరోవైపు పురుషుల క్వార్టర్ ఫైనల్లో మన జట్టు 2-3తో జపాన్ చేతిలో ఓడింది.