Badminton | నింగ్బో: ప్రతిష్టాత్మక బ్యాడ్మింటన్ ఆసియా చాంపియన్షిప్స్లో భారత పోరాటం రెండో రౌండ్కే ముగిసింది. భారీ ఆశలతో ఈ టోర్నీ బరిలో నిలిచిన 15 మంది భారత షట్లర్లు రెండో రౌండ్ కూడా దాటలేక చతికిలపడ్డారు. అగ్రశ్రేణి ఆటగాళ్లంతా విఫలమైనా తొలి రౌండ్లో హోరాహోరీగా పోరాడి రెండో రౌండ్ చేరిన పీవీ సింధు, హెచ్ఎస్ ప్రణయ్ ప్రిక్వార్టర్స్లోనే ఇంటిబాట పట్టారు. మహిళల సింగిల్స్లో సింధు 18-21, 21-13, 17-21 తేడాతో ఆరోసీడ్ హన్ యూయి చేతిలో చిత్తైంది.
తొలి సెట్లో ప్రత్యర్థికి గట్టిపోటీనిచ్చినా సింధుకి నిరాశ తప్పలేదు. రెండో సెట్లో పుంజుకున్నా నిర్ణయాత్మక మూడో సెట్లో చైనా అమ్మాయి దూకుడు పెంచడంతో సింధు కథ ముగిసింది. హన్ యూయితో ఆడిన ఆరు మ్యాచ్లలో సింధుకు ఇదే తొలి ఓటమి కావడం గమనార్హం. పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్స్లో ఏడో సీడ్ ప్రణయ్.. 18-21, 11-21 తేడాతో అన్సీడెడ్ తైవాన్ ఆటగాడు చున్ యి లిన్ చేతిలో పరాభవం పాలయ్యాడు. 43 నిమిషాల్లో ముగిసిన ఈ పోరులో ప్రణయ్ ప్రత్యర్థికి కనీస పోటీ ఇవ్వలేకపోయాడు. మహిళల డబుల్స్లో భారత ద్వయం తనీషా క్రాస్టో- అశ్విని పొన్నప్ప 17-21, 12-21 తేడాతో జపాన్ జోడీ నమి మత్సుయమ – చిహారు చేతిలో ఓడింది.