Olympics | ముంబై: ప్రతిష్ఠాత్మక ఒలింపిక్స్లో క్రికెట్ పున:ప్రవేశానికి రంగం సిద్ధమైంది. ఎప్పుడెప్పుడు విశ్వక్రీడల్లో క్రికెట్ చూస్తామనుకున్న అభిమానుల ఆశలు నెరవేరబోతున్నాయి. లాస్ఏంజిల్స్ వేదికగా 2028లో జరిగే విశ్వక్రీడల్లో క్రికెట్ను భాగం చేసేందుకు అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ(ఐవోసీ) గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. శుక్రవారం సమావేశమైన ఐవోసీ ఎగ్జిక్యూటివ్ బోర్డు క్రికెట్తో పాటు సాఫ్ట్బాల్, ఫ్లాగ్ ఫుట్బాల్, లాక్రోస్సె(సిక్సెస్), స్కాష్ ఒలింపిక్స్లో భాగం చేయబోతున్నది.
ఆదివారం నుంచి మొదలయ్యే ఐవోసీ సెషన్స్లో ఈ ప్రతిపాదనను సభ్యుల ముందు ఉంచి ఓటింగ్ చేపట్టనున్నారు. ఈ నిర్ణయంతో లాస్ఏంజిల్స్ ఒలింపిక్స్లో టీ20 ఫార్మాట్లో పురుషుల, మహిళల జట్లు బరిలోకి దిగనున్నాయి. ఇన్నాళ్లు ప్రపంచకప్, చాంపియన్స్ ట్రోఫీ, ఆసియాకప్ లాంటి వాటికి పరిమితమైన టీమ్ఇండియా ఇప్పుడు ఒలింపిక్స్లోనూ పోటీకి దిగనుంది.