Babar Azam | అంతర్జాతీయ క్రికెట్లో పిచ్, పరిస్థితులకు సంబంధం లేకుండా.. చెలరేగిపోయే భారత స్టార్ క్రికెటర్లు తన అభిమాన ప్లేయర్లని పాకిస్థాన్ సారథి బాబర్ ఆజమ్ (Babar Azam) పేర్కొన్నాడు. వన్డే ప్రపంచకప్లో రికార్డులు తిరగరాస్తున్న విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మతో పాటు న్యూజిలాండ్ రెగ్యులర్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ (Kane Williamson) ఆట అంటే తనకు ఎంతో ఇష్టమని బాబర్ వెల్లడించాడు. ఈ ముగ్గురూ ప్రస్తుత తరంలో అత్యుత్తమ ఆటగాళ్లను వాళ్లకు ప్రత్యర్థులతో సంబంధం లేదని పేర్కొన్నాడు.
‘ఆ ముగ్గురు (రోహిత్, కోహ్లీ, విలియమ్సన్) పరిస్థితులను చక్కగా అర్థం చేసుకుంటారు. మ్యాచ్ను చదవడంలో వాళ్లకు అపార అనుభవం ఉంది. ఆ ముగ్గురిని నేను ఆరాధిస్తాను’ అని పాక్ కెప్టెన్ వెల్లడించాడు. జట్టు కష్టాల్లో ఉన్న సమయంలో ఆదుకోవడంలో ఆ ముగ్గురికి తిరుగు లేదని.. ఎలాంటి బౌలింగ్ దాడినైనా తుత్తునియాలు చేయగల సామర్థ్యం వారిలో ఉందని బాబర్ పేర్కొన్నాడు. భారత్లో జరుగుతున్న ప్రపంచకప్లో బాబర్ ఆజమ్ నేతృత్వంలోని పాకిస్థాన్ జట్టు పెద్దగా ఆకట్టుకోలేకపోయిన విషయం తెలిసిందే. హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియంలో ఆడిన తొలి రెండు మ్యాచ్ల్లో నెగ్గిన పాకిస్థాన్ ఆ తర్వాత వరుస పరాజయాలతో నాకౌట్ రేసు నుంచి నిష్క్రమించింది.
కెప్టెన్సీకి ఎసరు!
మెగాటోర్నీలో పాక్ జట్టు స్థాయికి తగ్గ ప్రదర్శన చేయకపోవడంతో.. కెప్టెన్ బాధ్యత వహించాలనే వాదన పేరిగిపోతున్నది. దీంతో వరల్డ్కప్ తర్వాత బాబర్ నుంచి సారథ్య బాధ్యతలు తప్పించాలని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) యోచిస్తున్నది. దీంతో కెప్టెన్సీ మార్పుపై పాక్ క్రికెట్ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతున్నది. సర్ఫరాజ్ అహ్మద్, షాహీన్ షా అఫ్రిది, మహమ్మద్ రిజ్వాన్ల పేర్లు కెప్టెన్సీ రేసులో ప్రధానంగా వినిపిస్తున్నాయి. వీరిలో ఒక్కొక్కరికీ ఒక ఫార్మాట్లో సారథ్య బాధ్యతలు అప్పగిస్తే మేలని ఆ దేశ మాజీలు సూచిస్తున్నారు.