కొలంబో: ఆసియా కప్- 2023లో భాగంగా ఆదివారం భారత్-పాకిస్తాన్ మధ్య జరుగాల్సిన సూపర్-4 మ్యాచ్ వర్షం కారణంగా మధ్యలోనే ఆగిపోయింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 24 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసిన సమయంలో ఆట నిలిచిపోయింది. భారత్ బ్యాటర్లు మంచి ఊపు మీద ఉన్న సమయంలో వర్షం వచ్చి ఆట ఆగిపోవడంపై షోయబ్ అక్తర్ ఆసక్తికర ట్వీట్ చేశాడు. వరుణుడు పాకిస్తాన్కు అనుకూలంగా వ్యవహరించాడని పేర్కొన్నాడు.
‘అందరికీ హాయ్.. నేను మీ అక్తర్. నేను ఇక్కడి (కొలంబో)కి భారత్-పాక్ మ్యాచ్ చూడటానికి వచ్చా. ఇవాళ వర్షం మమ్మల్ని బతికించింది. గ్రూప్ స్థాయి మ్యాచ్లో వర్షం భారత్కు హెల్ప్ చేస్తే.. ఇప్పుడు ఆ అదృష్టం పాక్ను వరించింది’ అని అక్తర్ ట్విటర్లో పేర్కొన్నాడు. కాగా, ఈ మ్యాచ్కు రిజర్వ్ డే ఉండటంతో ఆదివారం ఆగిపోయిన దగ్గర నుంచి ఆట సోమవారం తిరిగి మొదలవుతుందని, రిజర్వ్ డే నాడైనామ్యాచ్ పూర్తిగా జరగాలని అక్తర్ తన ఆకాంక్షను వెలిబుచ్చారు.
పాక్ కెప్టెన్పై విమర్శలు..
టాస్ గెలిచి తొలుత ఫీల్డింగ్ ఎంచుకున్న పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్పై షోయబ్ అక్తర్ విమర్శలు గుప్పించాడు. పిచ్ బ్యాటింగ్కు అనుకూలించినా బాబర్ మాత్రం తొలుత బౌలింగ్ తీసుకోవడం తెలివైన నిర్ణయం కాదన్నాడు. కాగా, ఆదివారం వర్షం కారణంగా ఆట ఆగిపోయే సమయానికి భారత జట్టు 24.1 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ (17 నాటౌట్), విరాట్ కోహ్లీ (7 నాటౌట్) క్రీజులో ఉన్నారు. రోహిత్ శర్మ (56), గిల్ (58) అర్ధ సెంచరీలు చేసి ఔటయ్యారు.