తీవ్ర ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంకకు ఆస్ట్రేలియా క్రికెటర్లు తమవంతు సాయమందించేందుకు ముందుకువచ్చారు. ఇటీవలే శ్రీలంకతో టీ20, వన్డే, టెస్టులు ఆడిన ఆసీస్ క్రికెటర్లు.. అక్కడి పరిస్థితులను ప్రత్యక్షంగా చూసి చలించిపోయారు. ముఖ్యంగా పెద్దలతో పాటు చిన్నారులు కూడా ఆకలితో అలమటిస్తుండటంతో ఆసీస్ క్రికెటర్లు.. వాళ్ల ప్రైజ్ మనీని లంకలోని బాధిత చిన్నారులకు అందించనున్నారు.
ఈ మేరకు క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) ఒక ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించింది. ప్యాట్ కమిన్స్ సారథ్యంలోని టెస్టు జట్టుతో పాటు ఆరోన్ పించ్ నాయకత్వంలోని టీ20, వన్డే జట్లలో పాల్గొన్న ఆసీస్ క్రికెటర్లంతా లంక పర్యటనలో ఆడిన మ్యాచ్లలో వచ్చిన ప్రైజ్ మనీని చిన్నారులకు డొనేట్ చేయనున్నారని తెలిపింది. ఆసీస్ క్రికెటర్లు విరాళమిచ్చే నగదు విలువ 30వేల యూఎస్ డాలర్లు అని సీఏ వెల్లడించింది.
ఈ నగదును చిన్నారుల కోసం పాటుపడుతున్న యూనిసెఫ్నకు అందించనున్నారు. లంకలో యూనిసెఫ్ చిన్నారుల పోషకాహారం, ఇతర సమస్యల పరిష్కారానికి కృషిచేస్తున్నది. ఆసీస్ టెస్టు జట్టు సారథి ప్యాట్ కమిన్స్.. ఆస్ట్రేలియాలో యూనిసెఫ్కు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరిస్తున్నాడు. అతడి చొరవతోనే ఆసీస్ క్రికెటర్లు ఈ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తున్నది.