Australia Woments Team | భారత్, ఆస్ట్రేలియా మహిళా క్రికెట్ జట్ల మధ్య మంగళవారం జరిగిన మూడో టీ-20 మ్యాచ్లో ఆసీస్ జట్టు ఎనిమిది బంతులు మిగిలి ఉండగానే ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. 148 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన ఆసిస్ జట్టు ఓపెనర్ ఆల్యేసా హీలే (కెప్టెన్) 55 పరుగులు చేసి దీప్తి శర్మ బౌలింగ్ లో ఎల్బీడబ్ల్యూ అయ్యింది.
ఆమె స్థానంలో వచ్చిన తహిలా మైక్ గ్రాత్ కూడా 20 పరుగులకే పూజా వస్త్రాకర్ బౌలింగ్ లో దీప్తి శర్మకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ దారి పట్టింది. అలేస్యా హీలేతో ఓపెనింగ్ బ్యాటర్ గా వచ్చిన బెత్ మూనీ 52 పరుగులతో నాటౌట్ గా నిలిచింది. తాహిలా మైక్ గ్రాత్ తర్వాత వచ్చిన ఎల్లేసే పెర్రీ.. పూజా వస్త్రాకర్ చేతిలో ఎల్బీ డబ్ల్యూ అయ్యింది. తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన ఫోబే లిచ్ ఫీల్డ్ 17 పరుగులతో నాటౌట్ గా నిలిచింది. మూడు వికెట్లు కోల్పోయి ఆసీస్ 149 పరుగులు చేయడంతో విజయ తీరాలకు చేరింది.
అంతకుముందు బ్యాటింగ్ చేసిన భారత్ మహిళల జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 147 పరుగులు చేసింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా అన్నాబెల్ సూథర్ లాండ్, ప్లేయర్ ఆఫ్ సిరీస్ గా అల్యేషా హీలే ఎంపికయ్యారు. దీంతో మూడు టీ 20 మ్యాచ్ ల సిరీస్ ను ఆస్ట్రేలియా సొంతం చేసుకున్నది.