మెల్బోర్న్: ప్రతిష్ఠాత్మక యాషెస్ ట్రోఫీని ఆస్ట్రేలియా నిలుపుకున్నది. సొంతగడ్డపై తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్న ఆసిస్.. ఇంగ్లండ్ను మట్టికరిపించింది. ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ను మరో రెండు మ్యాచ్లు ఉండగానే 3-0తో కైవసం చేసుకున్నది. యాషెస్ టెస్ట్ సిరీస్లో భాగంగా మెల్బోర్న్లో జరుగుతున్న మూడో టెస్టులో ఇన్నింగ్స్ 14 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా విజయం సాధించింది. మొదటి నుంచే ఇంగ్లండ్పై పట్టుసాధించిన ఆసిస్… మ్యాచ్ను రెండున్నర రోజుల్లో ముగించడం విశేషం. దీంతో యాషెస్ సిరీస్ను ఆస్ట్రేలియా వశం చేసుకున్నది.
ఆస్ట్రేలియా తన మొదటి ఇన్నింగ్స్లో 267 పరుగులు చేయగా, ఇంగ్లండ్ 185 పరుగులకే తొలి ఇన్నింగ్స్లో ఆలౌట్ అయింది. అనంతరం రెండో ఇన్సింగ్ ప్రారంభించిన ఇంగ్లిష్ ఆటగాళ్లు మొదటి నుంచే తడబడ్డారు. టాపార్డర్ విఫలం చెందడంతో జట్టు పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. మ్యాచ్ మూడోరోజైన మంగళవారం ఉదయం బ్యాటింగ్ ప్రారంభించిన జోరూట్, బెన్ స్టోక్స్ కొద్దిసేపు కూడా క్రీజులో నిలదొక్కుకోలేకపోయారు. తర్వాత వచ్చిన బ్యాట్స్మెన్ వెంట వెంటనే పెవిలియన్ చేరడంతో ఇంగ్లండ్ తన రెండో ఇన్నింగ్స్లో కేవలం 68 పరుగులు మాత్రమే చేయగలిగింది.
ఆస్ట్రేలియా బౌలర్ స్కాట్ బోలాండ్.. ఇంగ్లిష్ బ్యాట్స్మెన్ పనిపట్టాడు. రెండో ఇన్నింగ్స్లో కేవలం 4 ఓవర్లు వేసిన స్కాట్.. 6 వికెట్లు తీసి రికార్డు సృష్టించాడు. మొత్తంగా 7 పరుగులు మాత్రమే ఇవ్వడం విశేషం. ఇక స్టార్క్ 3 వికెట్లు, గ్రీన్ ఒక వికెట్ తీసుకున్నాడు.