ODI World Cup 2023 | పరుగుల వరద, జడివాన, సునామీ కాదు.. ధర్మశాలలో ఏకంగా ఉల్కాపాతం సంభవించింది!
హిమాలయ పర్వత సానువుల్లో కంగారూలు పూనకం వచ్చినట్లు ఊగిపోయారు. ఓ వైపు వార్నర్ వాయిస్తుంటే.. మరో ఎండ్ నుంచి ట్రావిస్ హెడ్ శివతాండవమాడాడు. వీరి జోరుకు ధర్మశాల మౌన సాక్షిగా నిలువగా.. చివర్లో మ్యాక్స్వెల్, ఇంగ్లిస్, కమిన్స్ ప్రతి బంతికి సిక్సర్ కొట్టడమే తమ లక్ష్యం అన్నట్లు రెచ్చిపోయారు. ఫలితంగా ఆసీస్ భారీ స్కోరు చేసి హమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంటే.. ఆ తర్వాత అరాచకానికి అర్థం మార్చుతూ.. కివీస్ బ్యాటర్లు ఊచకోత కోశారు! రచిన్ రవీంద్ర రికార్డు సెంచరీకి నీషమ్ దంచుడు తోడవడంతో కంగారూల గుండెల్లో రైళ్లు పరిగెత్తినా.. చివర్లో ఒత్తిడికి చిత్తైన కివీస్ పరాజయంతోనే సరిపెట్టుకుంది. ఇరు జట్లు కలిసి 771 పరుగులు చేసిన ఈ మ్యాచ్లో గెలిచింది ఎవరైనా.. అభిమానులకు మాత్రం పైసా వసూల్ ప్రదర్శన చూసే చాన్స్ దక్కింది!
వన్డే ప్రపంచకప్ చరిత్రలో అత్యధిక పరుగులు (771) నమోదైన పోరు ఇదే. గతంలో ఈ రికార్డు దక్షిణాఫ్రికా-శ్రీలంక (754) పేరిట ఉంది.
ధర్మశాల: వన్డే ప్రపంచకప్లో ఆస్ట్రేలియా జోరు కొనసాగుతోంది. తొలి రెండు మ్యాచ్ల్లో ఓడిన ఆసీస్.. ఆ తర్వాత వరుసగా నాలుగో విజయంతో సెమీఫైనల్ బెర్త్కు మరింత చేరువైంది. శనివారం డబుల్ హెడర్లో భాగంగా జరిగిన తొలి పోరులో ఆస్ట్రేలియా 5 పరుగుల తేడాతో న్యూజిలాండ్పై విజయం సాధించింది. అసలు క్రికెట్ ఇలా కూడా ఆడుతారా అన్నట్లు ఇరు జట్లు సాగించిన విధ్వంసకాండకు ధర్మశాల స్టేడియం మోతెక్కిపోయింది.
టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు దిగిన ఆస్ట్రేలియా.. 49.2 ఓవర్లలో 388 పరుగులకు ఆలౌటైంది. గాయం నుంచి కోలుకొని వచ్చిన ఓపెనర్ ట్రావిస్ హెడ్ (67 బంతుల్లో 109; 10 ఫోర్లు, 7 సిక్సర్లు) మెరుపు శతకంతో చెలరేగితే.. డేవిడ్ వార్నర్ (65 బంతుల్లో 81; 5 ఫోర్లు, 6 సిక్సర్లు) ఫామ్ కొనసాగించాడు. మిషెల్ మార్ష్ (36), స్మిత్ (18), లబుషేన్ (18) తలా కొన్ని పరుగులు చేయగా.. గత మ్యాచ్ సెంచరీ హీరో మ్యాక్స్వెల్ (24 బంతుల్లో 41; 5 ఫోర్లు, 2 సిక్సర్లు), ఇంగ్లిస్ (28 బంతుల్లో 38; 4 ఫోర్లు, ఒక సిక్సర్), కమిన్స్ (14 బంతుల్లో 37; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. కివీస్ బౌలర్లలో ఫిలిప్స్, బౌల్ట్ చెరో మూడు వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో న్యూజిలాండ్ 50 ఓవర్లలో 9 వికెట్లకు 383 పరుగులు చేసింది. రచిన్ రవీంద్ర (89 బంతుల్లో 116; 9 ఫోర్లు, 5 సిక్సర్లు) సెంచరీ తన పేరిట రాసుకోగా.. డారిల్ మిషెల్ (54), నీషమ్ (39 బంతుల్లో 58; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధశతకాలతో రాణించినా జట్టును గెలిపించలేకపోయారు. ఆసీస్ బౌలర్లలో జాంపా 3, కమిన్స్, హజిల్వుడ్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. హెడ్కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ దక్కింది.
చివరి ఓవర్లో న్యూజిలాండ్ విజయానికి 19 పరుగులు అవసరం కాగా.. అప్పటికే అర్ధశతకం సాధించిన నీషమ్ చక్కటి షాట్లతో ఆకట్టుకున్నాడు. తొలి బంతికి సింగిల్ రాగా.. రెండో బాల్ వైడ్కు బౌండ్రీ వెళ్లింది. తిరిగి స్టార్క్ రెండో బంతి వేయగా.. దానికి రెండు పరుగులు వచ్చాయి. ఆ తర్వాత మరో రెండు బంతులకు కూడా సేమ్ సీన్ రిపీటైంది. దీంతో కివీస్ లక్ష్యం 2 బంతుల్లో ఏడు పరుగులకు చేరింది. ఒక్క భారీ షాట్ కొట్టిన కివీస్ గెలువడం ఖాయమే అనుకుంటే.. అది సాధ్యపడకపోగా.. తిరిగి స్ట్రయికింగ్లోకి రావాలని ప్రయత్నించిన నీషమ్ రనౌట్ అయ్యాడు. దీంతో న్యూజిలాండ్ ఆశలు ఆవిరయ్యాయి.
ఆస్ట్రేలియా: 49.2 ఓవర్లలో 388 (హెడ్ 109, వార్నర్ 81; ఫిలిప్స్ 3/37, బౌల్ట్ 3/77), న్యూజిలాండ్: 50 ఓవర్లలో 383/9 (రచిన్ 116, నీషమ్ 58; జాంపా 3/74).