మెల్బోర్న్: ‘బోర్డర్-గవాస్కర్’ సిరీస్లో భాగంగా ఆడిన రెండు టెస్టుల్లోనూ టీమ్ఇండియా చేతిలో ఓటమి పాలైన ఆస్ట్రేలియా.. వన్డే సిరీస్ కోసం బలమైన జట్టును ఎంపిక చేసింది. వచ్చే నెల 17 నుంచి ప్రారంభం కానున్న మూడు మ్యాచ్ల సిరీస్ కోసం క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) గురువారం 16 మందితో కూడిన జట్టును ప్రకటించింది. వన్డే టీమ్కు కూడా కమిన్స్ కెప్టెన్గా వ్యవహరించనుండగా.. గాయాల నుంచి కోలుకున్న ఆల్రౌండర్లు గ్లెన్ మాక్స్వెల్, మిషెల్ మార్ష్ జట్టులో చోటు దక్కించుకున్నారు. జే రిచర్డ్సన్కు పిలుపు రాగా, టెస్టు సిరీస్కు దూరమైన డేవిడ్ వార్నర్, మిషెల్ స్టార్క్ వన్డేల్లో ఆడనున్నారు.
సిరీస్లో తొలి మ్యాచ్ మార్చి 17న ముంబైలో జరుగనుండగా.. రెండో వన్డేకు (మార్చి 19) విశాఖపట్నం వేదిక కానుంది. మార్చి 22న చెన్నైలో చివరి పోరు జరుగుతుంది. ఈ ఏడాది చివర్లో భారత్ వేదికగా ప్రతిష్ఠాత్మక ఐసీసీ వన్డే ప్రపంచకప్ జరుగనున్న నేపథ్యంలో ఈ సిరీస్ ఆస్ట్రేలియాకు కీలకంగా మారింది.