Australia | మహిళల క్రికెట్లో తమకు తిరుగులేదని ఆస్ట్రేలియా మరోసారి నిరూపించింది. వరుసగా మూడోసారి టీ20 ప్రపంచకప్ నెగ్గి ‘హ్యాట్రిక్’ నమోదు చేసుకున్న ఆసీస్.. ఓవరాల్గా ఆరోసారి ఈ ట్రోఫీ కైవసం చేసుకుంది. సెమీఫైనల్లో టీమ్ఇండియాపై పోరాడి నెగ్గిన కంగారూలు.. తుదిపోరులో దక్షిణాఫ్రికాపై ఏకపక్షం విజయం సాధించారు. తొలిసారి మెగాటోర్నీ ఫైనల్ చేరిన దక్షిణాఫ్రికా.. సొంతగడ్డపై జరిగిన తుదిపోరులో సత్తాచాటలేకపోయింది. బెత్ మూనీ మరోసారి విలువైన ఇన్నింగ్స్తో కంగారూలకు భారీ స్కోరు అందించగా.. లక్ష్యఛేదనలో వాల్వార్ట్ మినహా తక్కినవాళ్లు విఫలమవడంతో దక్షిణాఫ్రికా రన్నరప్తో సరిపెట్టుకుంది.
కేప్టౌన్: ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన ఆస్ట్రేలియా జట్టు రికార్డు స్థాయిలో ఆరోసారి మహిళల టీ20 ప్రపంచకప్ కైవసం చేసుకుంది. టోర్నీలో అపజయమన్నదే ఎరుగని ఆసీస్.. ఆదివారం జరిగిన మెగా ఫైనల్లో 19 పరుగుల తేడాతో ఆతిథ్య దక్షిణాఫ్రికాను చిత్తుచేసింది. ఆస్ట్రేలియాకు ఇది ‘హ్యాట్రిక్’ టైటిల్ కావడం మరో విశేషం. 2018, 2020లోనూ ఆ జట్టు విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. బెత్ మూనీ (53 బంతుల్లో 74 నాటౌట్; 9 ఫోర్లు, ఒక సిక్సర్) అజేయ అర్ధశతకంతో అలరించగా.. గార్డ్నర్ (29; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), అలీసా హీలీ (18; 3 ఫోర్లు) రాణించారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో షబ్నమ్ ఇస్మాయిల్, మరీనే కాప్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 137 పరుగులకే పరిమితమైంది. లారా వాల్వార్ట్ (48 బంతుల్లో 61; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) దంచికొట్టినా.. తక్కినవాళ్లు పెద్దగా ఆకట్టుకోలేకపోవడంతో దక్షిణాఫ్రికాకు పరాజయం తప్పలేదు. తొలిసారి మెగాటోర్నీ ఫైనల్కు అర్హత సాధించిన దక్షిణాఫ్రికా చివరకు రన్నరప్తో సరిపెట్టుకుంది. బెత్ మూనీకి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’, గార్డ్నర్కు ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డులు దక్కాయి.
పురుషుల క్రికెట్లో తొలిసారి 2007లో టీ20 ప్రపంచకప్ నిర్వహించిన అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) మరో రెండేండ్లకు మహిళల విభాగంలోనూ మెగాటోర్నీని ప్రారంభించింది. తొలిసారి (2009) నిర్వహించిన వరల్డ్కప్లో ఇంగ్లండ్ చాంపియన్గా నిలువగా.. ఆ తర్వాత వరుసగా మూడుసార్లు (2010, 2012, 2014లో) ఆస్ట్రేలియా కప్పు చేజిక్కించుకొని హ్యాట్రిక్ నమోదు చేసుకుంది. 2016లో భారత్లో జరిగిన ప్రపంచకప్లో వెస్టిండీస్ నయా చాంపియన్గా అవతరించగా.. అప్పటి నుంచి వరుసగా మూడోసారి (2018, 2020, 2023లో) ఆస్ట్రేలియా ట్రోఫీ చేజిక్కించుకొని డబుల్ హ్యాట్రిక్ పూర్తి చేసుకుంది. 2020 ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓడి రన్నరప్గా నిలిచిన భారత మహిళల జట్టు.. ఈసారి సెమీఫైనల్లోనూ కంగారూల చేతిలో పరాజయం పాలైంది. ఒక దశలో పురుషుల క్రికెట్ను ఏకఛత్రాధిపత్యంతో ఏలిన ఆసీస్.. ప్రస్తుతం మహిళల క్రికెట్లో అలాంటి దశలో కొనసాగుతున్నది. ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకపోవడం.. ఒత్తిడిని దరిచేరనివ్వకపోవడం.. ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఓటమిని అంగీకరించకపోవడం వంటి లక్షణాలతో ఆసీస్ మహిళల క్రికెట్ను ఏలుతున్నది. ప్రస్తుత మెగాటోర్నీనే తీసుకుంటే.. భారత్తో జరిగిన సెమీఫైనల్లో తప్ప ఆ జట్టుకు పెద్దగా ప్రతిఘటన ఎదురవలేదు. తుదిపోరులో టాస్ గెలువడంతోనే సగం మ్యాచ్ గెలిచేసిన కంగారూలు.. బరిలోకి దిగాక మిగిలిన పని పూర్తి చేశారు.