బ్రిస్బేన్: బౌలర్ల హవా సాగిన తొలి టెస్టులో ఆస్ట్రేలియా ఘనవిజయం సాధించింది. రెండు రోజుల్లోనే ముగిసిన మ్యాచ్లో ఆతిథ్య ఆసీస్ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఫలితంగా మూడు మ్యాచ్ల సిరీస్లో 1-0తో ముందంజ వేసింది. తొలి ఇన్నింగ్స్లో దక్షిణాఫ్రికా 152 పరుగులకే ఆలౌట్ కాగా.. ఓవర్నైట్ స్కోరు 35/4తో ఆదివారం రెండో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఆస్ట్రేలియా 218 పరుగులు చేసింది. సహచరులంతా చేతులెత్తేసిన చోట మిడిలార్డర్ బ్యాటర్ ట్రావిస్ హెడ్ (92; 13 ఫోర్లు, ఒక సిక్సర్) ఒంటరి పోరాటంతో ఆకట్టుకున్నాడు. దక్షిణాఫ్రికా బౌలర్లలో రబడ 4, జన్సెన్ మూడు వికెట్లు పడగొట్టారు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన దక్షిణాఫ్రికా 99 పరుగులకు ఆలౌటైంది. ఖాయా జొండో (36 నాటౌట్; 6 ఫోర్లు), బవుమా (29) మినహా తక్కినవాళ్లంతా విఫలమయ్యారు. ఆసీస్ బౌలర్లలో కమిన్స్ 5 వికెట్లతో అదరగొట్టాడు. అనంతరం 34 పరుగుల లక్ష్యాన్ని ఆసీస్ 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. సఫారీ పేసర్ రబడ (4/13) నిప్పులు చెరగడంతో ఉస్మాన్ ఖవాజా (2), వార్నర్ (3), స్మిత్ (6), హెడ్ (0) ఒకరివెంట ఒకరు పెవిలియన్కు వరుస కట్టారు. అయితే టార్గెట్ పెద్దది కాకపోవడంతో ఆసీస్ సులువుగా గట్టెక్కింది. హెడ్కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. తొలి రోజు ఆటలో 15 వికెట్లు నేలకూలగా.. రెండో రోజు 19 వికెట్లు పడటం గమనార్హం.