డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో ఈ టీ20 ప్రపంచకప్ ఆరంభించిన ఆస్ట్రేలియాకు టోర్నీలో శుభారంభం దక్కలేదు. తొలి మ్యాచ్లో న్యూజిల్యాండ్ చేతిలో ఘోరపరాభవం చవి చూసిన ఆ జట్టు.. తర్వాతి మ్యాచులన్నీ గెలవకుంటే నాకౌట్స్ చేరడం కష్టంగా మారే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆసియా కప్ విజేతలైన శ్రీలంకతో మ్యాచ్ మొదలైంది.
టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆసీస్ జట్టు.. లంకేయులను 157/6 స్కోరుకే పరిమితం చేశారు. అయితే లక్ష్య ఛేదనలో కంగారూలు తడబడ్డారు. వార్నర్ (11), మిచెల్ మార్ష్ (18) ఇద్దరూ విఫలమయ్యారు. ఆరోన్ ఫించ్ (42 బంతుల్లో 31 నాటౌట్) జిడ్డు బ్యాటింగ్ ఆడుతూ బౌండరీలు బాదలేకపోయాడు. ఇలాంటి సమయంలో క్రీజులోకి వచ్చిన గ్లెన్ మ్యాక్స్వెల్ (12 బంతుల్లో 23) ధనాధన్ ఇన్నింగ్స్తో మ్యాచ్లో ఊపు తెచ్చాడు.
అతను అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చిన మార్కస్ స్టొయినిస్ (18 బంతుల్లో 59 నాటౌట్) ఆకాశమే హద్దుగా చెలరేగాడు. దీంతో ఆ జట్టు 16.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. ఈ విజయంతో ఆసీస్ నెట్ రన్ రేట్ కూడా కొంత మెరుగైంది. లంక బౌలర్లలో తీక్షణ, కరుణరత్నే, ధనంజయ డిసిల్వ తలో వికెట్ తీసుకున్నారు.
A sensational fifty from Marcus Stoinis powers Australia to a spectacular win 👊🏻#AUSvSL | #T20WorldCup | 📝: https://t.co/cwIkvUCvbM pic.twitter.com/HYN0mSCUOx
— ICC (@ICC) October 25, 2022