IND vs AUS | దశాబ్దాలుగా భారత్లో కొనసాగుతున్న సంప్రదాయాన్ని అహ్మదాబాద్ పిచ్ మరోసారి గుర్తు చేసింది. తొలి రెండు రోజులు పూర్తిగా బ్యాటింగ్కు సహకరించడం.. ఆ తర్వాత నెమ్మదిగా బంతి స్పిన్ అవడాన్ని ఎన్నో ఏండ్లుగా చూస్తూవస్తున్న అభిమానులను నాలుగో టెస్టు పాత రోజుల్లోకి తీసుకెళ్లింది. ఓపెనర్ ఉస్మాన్ ఖవాజాతో పాటు ఆల్రౌండర్ కామెరూన్ గ్రీన్ సెంచరీలతో కదంతొక్కడంతో ‘బోర్డర్-గవాస్కర్’ నాలుగో టెస్టులో ఆస్ట్రేలియా భారీ స్కోరు చేసింది. ఈ సిరీస్లో ఇప్పటి వరకు టీమ్ఇండియా స్పిన్ బలంతోనే విజృంభించగా.. బ్యాటింగ్ యూనిట్కు నేడు అసలు సిసలు పరీక్ష ఎదురుకానుంది!
అహ్మదాబాద్: చాన్నాళ్ల తర్వాత భారత గడ్డపై ఆస్ట్రేలియా జట్టు సాధికారిక ఆటతో భారీ స్కోరు చేసింది. తొలి రోజు ఎక్కడ ఆపారో శుక్రవారం అక్కడి నుంచే మొదలు పెట్టడంతో ఆసీస్ తొలి ఇన్నింగ్స్లో 480 పరుగులు చేసింది. ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా (422 బంతుల్లో 180; 21 ఫోర్లు) భారీ సెంచరీ నమోదు చేసుకోగా.. పేస్ ఆల్రౌండర్ కామెరూన్ గ్రీన్ (170 బంతుల్లో 114; 18 ఫోర్లు) టెస్టు కెరీర్లో తొలి శతకాన్ని తన పేరిట రాసుకున్నాడు. ఆఖర్లో నాథన్ లియాన్ (96 బంతుల్లో 34; 6 ఫోర్లు), టాడ్ మార్ఫి (61 బంతుల్లో 41; 5 ఫోర్లు) కూడా తమ బ్యాట్లకు పనిచెప్పారు. భారత బౌలర్లలో రవిచంద్రన్ అశ్విన్ 6, మహమ్మద్ షమీ రెండు వికెట్లు పడగొట్టారు.
అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమ్ఇండియా.. శుక్రవారం రెండో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 36 పరుగులు చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ (17), శుభ్మన్ గిల్ (18) క్రీజులో ఉన్నారు. చేతిలో 10 వికెట్లు ఉన్న భారత్.. ప్రత్యర్థి స్కోరుకు ఇంకా 444 పరుగులు వెనుకబడి ఉంది. తొలి రెండు రోజులు పూర్తిగా బ్యాటింగ్కు సహకరించిన అహ్మదాబాద్ పిచ్.. మూడో రోజు నుంచి స్పిన్కు మొగ్గుచూపే అవకాశం ఉండటం భారత్ను కాస్త కలవరపెడుతున్నది. మరోవైపు న్యూజిలాండ్తో సిరీస్లో శ్రీలంక దూకుడుగా ఆడుతున్న నేపథ్యంలో.. ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్కు చేరాలంలే రోహిత్ సేనకు ఈ మ్యాచ్లో విజయం తప్పనిసరి.
రెండో రోజు చివర్లో తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమ్ఇండియాకు పెద్దగా ఇబ్బందులు ఎదురవలేదు. ఓపెనర్లు రోహిత్ శర్మ, గిల్ నెమ్మదిగా ఆడుతూ వికెట్ పడకుండా రోజును ముగించారు. మూడోరోజు మన టాపార్డర్ ప్రదర్శనపైనే ఈ మ్యాచ్ ఫలితం ఆధారపడి ఉంది. ఈ సిరీస్లో ఇప్పటి వరకు భారత్ తరఫున రోహిత్ ఒక్కడే సెంచరీ సాధించగా.. మిగిలిన వాళ్లెవరూ పెద్ద ఇన్నింగ్స్ ఆడలేకపోయారు. బ్యాటింగ్కు అనుకూలిస్తున్న వికెట్పై మనవాళ్లు ఎలా అడుతారనేది ఆసక్తికరం. ఓపెనర్గా బరిలోకి దిగిన ఖవాజా 10 గంటలకు పైగా క్రీజులో నిలిచి ఆసీస్కు భారీ స్కోరు అందించాడు. లియాన్, మార్ఫి కూడా ధాటిగా ఆడటాన్ని బట్టి చూస్తే.. పిచ్ నిర్జీవంగా ఉందని స్పష్టమవుతున్నది. మరి రోహిత్, గిల్, పుజారా, కోహ్లీ, శ్రేయస్, జడేజా, భరత్, అశ్విన్, అక్షర్తో కూడిన టీమ్ఇండియా ఎన్ని పరుగులు చేస్తుందో చూడాలి.
ఓవర్నైట్ స్కోరు 255/4తో రెండో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఆస్ట్రేలియా ఆడుతూ పాడుతూ పరుగులు రాబట్టింది. అప్పటికే క్రీజులో పాతుకుపోయిన ఉస్మాన్ ఖవాజా, గ్రీన్ భారత బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్నారు. తొలి సెషన్ మొత్తం ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా ఈ ఇద్దరూ ఇన్నింగ్స్ను ముందుకు నడిపించారు. ఉస్మాన్ ఆచితూచి ఆడుతుంటే.. గ్రీన్ మాత్రం వేగంగా పరుగులు రాబట్టాడు. ఐదో వికెట్కు 208 పరుగులు జోడించిన అనంతరం గ్రీన్ను అశ్విన్ ఔట్ చేశాడు. అదే ఓవర్లో అలెక్స్ కారీ (0) కూడా వెనుదిరిగాడు. స్టార్క్ (6) ఎక్కువసేపు నిలువలేకపోగా.. డబుల్ సెంచరీ చేసేలా కనిపించిన ఉస్మాన్ ఖవాజాను చివరకు అక్షర్ పటేల్ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. రివ్యూ ద్వారా భారత్ ఈ వికెట్ సాధించింది. ఇంకేముంది మరికాసేపట్లో ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ ముగియడం ఖాయమే అనుకుంటే.. ఆసీస్ స్పిన్నర్లు ఆఖర్లో పోరాట పటిమ కనబర్చారు. లియాన్, మార్ఫి స్పెషలిస్ట్ బ్యాటర్లను తలపిస్తూ.. పరుగులు రాబట్టారు. అశ్విన్ ఒక్కడే కాస్త ప్రభావం చూపగా.. మిగిలినవాళ్ల బౌలింగ్లో ఈ జోడీ సునాయాసంగా పరుగులు రాబట్టింది. తొమ్మిదో వికెట్కు వీరిద్దరూ 70 పరుగులు జోడించడంతో ఆసీస్ మరింత భారీ స్కోరు చేయగలిగింది. వీరిద్దరినీ అశ్విన్ ఔట్ చేయడంతో కంగారూల ఇన్నింగ్స్ ముగిసింది.
స్వదేశంలో జరిగిన టెస్టుల్లో అత్యధిక (26) సార్లు ఐదు వికెట్ల ప్రదర్శన కనబరిచిన భారత బౌలర్గా అశ్విన్ నిలిచాడు. మరోవైపు టెస్టుల్లో ఆస్ట్రేలియాపై ఎక్కువ(113) వికెట్లు తీసిన బౌలర్గా అనిల్కుంబ్లేను అశ్విన్ అధిగమించాడు.
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్: 480 (ఖవాజా 180, గ్రీన్ 114; అశ్విన్ 6/91, షమీ 2/134), భారత్ తొలి ఇన్నింగ్స్: 36/0 (రోహిత్ 17 నాటౌట్, గిల్ 18 నాటౌట్).