హాంగ్జౌ: చైనాలోని హాంగ్జౌ వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత మెన్స్ హాకీ జట్టు శుభారంభం చేసింది. తొలి మ్యాచ్లో ఉజ్బెకిస్థాన్ జట్టుపై ఘన విజయం సాధించింది. మ్యాచ్ ఆద్యంతం ఉజ్బెకిస్థాన్ జట్టుపై ఆధిపత్యం కనబర్చిన భారత జట్టు చివరికి 16-0 తేడాతో గ్రాండ్ విక్టరీ నమోదు చేసింది. లలిత్ ఉపాధ్యాయ్, వరుణ్ కుమార్ నాలుగేసి గోల్స్, మన్దీప్ సింగ్ హ్యాట్రిక్ గోల్స్ సాధించడం ద్వారా భారత్ విజయంలో కీలక పాత్ర పోషించారు.
మ్యాచ్ తొలి క్వార్టర్లో లలిత్ ఉపాధ్యాయ్, వరుణ్ కుమార్ చెరో గోల్ కొట్టగా, ఉజ్బెకిస్థాన్ ఒక్క గోల్ కూడా చేయలేక పోయింది. దాంతో స్కోర్ 2-0కు చేరింది. రెండో క్వార్టర్ మొదలవగానే అభిషేక్, లలిత్ ఉపాధ్యాయ్, మన్దీప్ సింగ్ తలా ఒక్క గోల్ చేశారు. దాంతో స్కోర్ 5-0కు పెరిగింది. రెండో క్వార్టర్ ముగిసే సమయానికి మన్దీప్ మరో రెండు గోల్స్ చేసి స్కోర్ను 7-0కు పెంచాడు.
ఇక మూడో క్వార్టర్లో భారత్ మరింత విజృంభించింది. వరుణ్ కుమార్, సుఖ్జీత్, అమిత్ రోహిదాస్ వెంటవెంటనే మూడు గోల్స్ కొట్టారు. దాంతో జట్టు స్కోర్ 10-0కు చేరింది. ఆ తర్వాత సుఖ్జీత్, లలిత్ ఉపాధ్యాయ్ చెరో గోల్ చేయడంతో మూడో క్వార్టర్ ముగిసే సమయానికి మొత్తం స్కోర్ 12-0కు పెరిగింది. నాలుగో క్వార్టర్లో వరుణ్కుమార్ తన నాలుగో గోల్ కొట్టగా, ఆ వెంటనే లలిత్ ఉపాధ్యాయ్ కూడా నాలుగో గోల్ సాధించాడు. ఆ తర్వాత ఇండియా మరో రెండు గోల్స్ చేసి 16-0 తేడాతో ఉజ్బెకిస్థాన్ను ఓడించింది. కాగా, తర్వాత మ్యాచ్లో భారత్.. సింగపూర్తో తలపడనుంది.