Asian Games | హాంగ్జౌ: ఆసియా క్రీడల్లో సెంచరీ కొట్టడమే లక్ష్యంగా భారత అథ్లెట్లు దూసుకెళ్తున్నారు. పోటీల తొమ్మిదో రోజు స్వర్ణం దక్కకపోయినా.. వేర్వేరు క్రీడాంశాల్లో కలిపి భారత్ ఖాతాలో 7 పతకాలు చేరాయి. లాంగ్జంప్లో అన్సీ సోజన్ కెరీర్ బెస్ట్ ప్రదర్శనతో రజత పతకం కొల్లగొట్టగా.. 400 మిక్స్డ్ రిలేలో అజ్మల్, విద్య, రాజేశ్, సుభతో కూడిన భారత జట్టు వెండి కైవసం చేసుకుంది. మహిళల 3 వేల మీటర్ల స్టీపుల్చేజ్లో పారుల్ చౌదరీ వెండి వెలుగులు విరజిమ్మగా.. ప్రీతి కాంస్యం గెలుచుకుంది. టీటీలో సుతీర్థ-ఐహిక జంట కంచుతో సరిపెట్టుకోగా.. స్పీడ్ స్కేటింగ్లో పురుషుల, మహిళల జట్లకు కాంస్య పతకాలు దక్కాయి. మొత్తంగా 60 మెడల్స్ ఖాతాలో వేసుకున్న భారత్ వంద పతకాల వైపు వడివడిగా అడుగులు వేస్తున్నది.
ప్రతిష్ఠాత్మక ఆసియా క్రీడల్లో భారత్ జోరు కొనసాగుతున్నది. చైనా వేదికగా జరుగుతున్న పోటీల్లో సోమవారం మన అథ్లెట్లు ఏడు పతకాలు సొంతం చేసుకున్నారు. 400 మీటర్ల మిక్స్ రిలే జట్టు చిరుతను తలపించే వేగంతో వెండి పతకం ఖాయం చేసుకుంది. తుదిపోరులో మహమ్మద్ అజ్మల్ (43.14 సెకన్లు), విద్య రామరాజ్ (54.19 సెకన్లు), రాజేశ్ రమేశ్ (45.77 సెకన్లు), సుభా వెంకటేశన్ (51.24 సెకన్లు) బృందం 3 నిమిషాల 14.34 సెకన్లలో లక్ష్యాన్ని చేరి మూడో స్థానంలో నిలిచింది. అయితే రెండో స్థానం దక్కించుకున్న శ్రీలంక అథ్లెట్లు పరుగు సమయంలో లైన్ దాటి అనర్హతకు గురి కావడంతో భారత్ కాంస్య పతకాన్ని రజతంగా ప్రకటించారు. ఈ రేసుకు ముందు అర్హత పోటీలో విద్య 55.42 సెకన్లలోనే లక్ష్యాన్ని చేరుకుంది. దాంతో, అత్యంత వేగంగా 400 మీటర్లు పరుగెత్తిన భారతీయ మహిళగా 39 ఏళ్ల క్రితం పరుగుల రాణి పీటీ ఉష నెలకొల్పిన రికార్డును విద్య సమం చేసింది. 1984 ఒలింపిక్స్లో ఉష 400 మీటర్ల హర్డిల్స్ను 55.42 సెకన్లలో పూర్తి చేసింది. పెద్దగా అంచనాలు లేకుండా బరిలోకి దిగిన స్కేటింగ్లో భారత పురుషుల, మహిళల జట్లు కాంస్య పతకాలు నెగ్గగా.. లాంగ్జంప్లో అన్సీ సోజన్ వెండి వెలుగులు విరజిమ్మింది. పలితంగా 9వ రోజు పోటీలు ముగిసేసరికి భారత్ 60 మెడల్స్ (13 స్వర్ణాలు, 24 రజతాలు, 23 కాంస్యాలు)తో పట్టికలో నాలుగో స్థానంలో ఉంది.
స్టీపుల్ చేజ్లో డబుల్
మహిళల 3వేల మీటర్ల స్టీపుల్ చేజ్లో భారత అథ్లెట్లు రెండు పతకాలు కైవసం చేసుకున్నారు. పారుల్ చౌదరీ 9 నిమిషాల 27.63 సెకన్లలో రేసు పూర్తి చేసి వెండి పతకం చేజిక్కించుకుంది. రేసు ఆరంభం నుంచే దూసుకెళ్లిన పారుల్.. పసిడి నెగ్గిన బహ్రెయిన్ అథ్లెట్ యవి విన్ఫ్రైడ్ కంటే 9 సెకన్లు వెనుక ఉండిపోయింది. అంతర్జాతీయ స్థాయిలో నిలకడగా రాణిస్తున్న పారుల్ ఏషియన్ గేమ్స్లోనూ అదే జోరు కనబర్చినా.. బంగారు పతకాన్ని మాత్రం తృటిలో కోల్పోయింది. ఇక ఇదే విభాగంలో భారత మరో అథ్లెట్ ప్రీతి 9 నిమిసాల 43.32 సెకన్లలో లక్ష్యాన్ని చేరి కాంస్య పతకం గెలిచింది. దీంతో ఈ విభాగంలో భారత్కు రజత, కాంస్యాలు దక్కాయి.
అన్సీకి రజతం
ఆసియా చాంపియన్షిప్లో నాలుగో స్థానంతో సరిపెట్టుకున్న అన్సీ సోజన్ ఆసియా క్రీడల్లో అదరగొట్టింది. ఈ 22 ఏళ్ల కేరళ సంచలనం లాంగ్జంప్లో భారత్కు రెండో రజతం అందించింది. సోమవారం జరిగిన ఫైనల్లో ఐదో ప్రయత్నంలో సోజన్ శక్తినంతా కూడదీసుకొని 6.63 మీటర్ల దూరం దూకి రజత పతకాన్ని ముద్దాడింది. అత్యుత్తమ ప్రదర్శనతో రెండో స్థానంలో నిలిచిని సోజన్.. స్వర్ణం గెలిచిన షికీ గ్జియాంగ్ కంటే 10 సెంటీమీటర్లు వెనుకబడి పసిడి దూరం చేసుకుంది. ఇదే విభాగంలో పోటీపడ్డ మరో భారత లాంగ్జంపర్ షైలీ సింగ్ ఫైనల్లో సత్తా చాటలేకపోయింది. ఐదో ప్రయత్నంలో 6.38 మీటర్ల దూరం మాత్రమే దూకి నిరాశ పరిచింది.
బ్రిడ్జ్లో పతకం ఖరారు
బ్రిడ్జ్ పోటీలో భారత్కు పతకం ఖాయమైంది. పురుషుల జట్టు రౌండ్ రాబిన్ పద్ధతిలో 288.60 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచి కనీసం కాంస్యం ఖాయం చేసింది. సెమీఫైనల్లో భారత జట్టు చైనాను
ఢీ కొననుంది.
రెండు కాంస్యాలు మనవే!
ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగిన స్కేటింగ్ జట్లు ఆసియా క్రీడల్లో భారత్కు రెండు పతకాలు అందించాయి. స్పీడ్ స్కేటింగ్ 3వేల మీటర్ల రీలేలో భారత అబ్బాయిలు, అమ్మాయిలు చెరొక పతకంతో మెరిశారు. పురుషుల స్పీడ్ స్కేటింగ్ 3వేల మీటర్ల రీలేలో అర్యన్పాల్ సింగ్ ఘుమన్, అనంద్ కుమార్ వెల్కుమార్, సిద్ధాంత్ రాహుల్ కాంబ్లే, విక్రమ్ రాజేంద్ర బృందం 4 నిమిషాల10.12 సెకన్ల టైమింగ్తో కాంస్యం అందుకుంది. చైనీస్తైపీ (4 ని.19.44 సె), దక్షిణా కొరియా (4ని.21.14సె) వరుసగా స్వర్ణ, రజతాలు దక్కించుకున్నాయి. మహిళల జట్టు అంచనాలకు మించి రాణించి కాంస్య పతకం దక్కించుకుంది. సంజన బథులా, కార్తీక జగదీశ్వరన్, హీరాల్ సాధు, హారతి కస్తూరి రాజ్ బృందం 3వేల మీటర్ల రీలేలో 4 నిమిషాల 34.86 సెకన్లలో లక్ష్యాన్ని చేరింది.
సెమీస్లో హాకీ జట్టు
ఆసియా క్రీడల్లో ఫేవరెట్గా బరిలోకి దిగిన భారత పురుషుల హాకీ జట్టు.. తమ విధ్వంసకర ఆటతీరుతో ప్రత్యర్థులను హడలెత్తిస్తున్నది. ఇప్పటికే సింగపూర్, పాకిస్థాన్పై భారీ తేడాతో గెలిచిన హర్మన్ప్రీత్ సింగ్ సేన సోమవారం బంగ్లాదేశ్ను చిత్తుగా ఓడించింది. కెప్టెన్ హర్మన్ , మన్దీప్ హ్యాట్రిక్ గోల్స్ కొట్టడంతో భారత్12-0తో బంగ్లాను మట్టికరిపించింది. తద్వారా పూల్-‘ఎ’లో ఓటమి ఎరగని భారత్ సెమీఫైనల్కు దూసుకెళ్లింది. భారత జట్టు ఇప్పటివరకూ ఆడిన ఐదో మ్యాచ్ల్లో రికార్డు స్థాయిలో 58 గోల్స్ కొట్టడం విశేషం.