Asian Games | ఆసియా క్రీడలు చైనాలోని హాంగ్జౌ నగరంలోకొనసాగుతున్నాయి. క్రీడలు ప్రారంభమైనప్పటి నుంచి వివాదాలు తలెత్తుతున్నాయి. వాస్తవానికి 2022లో ఆసియా క్రీడలు జరుగాల్సి ఉండగా కొవిడ్ కారణంగా వాయిదాపడ్డాయి. అయితే, అరుణాచల్ ప్రదేశ్ ఆటగాళ్లకు చైనా స్టేపుల్ వీసాలు జారీ చేయడంతో విమర్శలు వెల్లువెత్తాయి. తాజాగా ఉత్తర కొరియా, దక్షిణా కొరియా దేశాల మధ్య విభేదాలు స్టేడియంలోనే బయటపడ్డాయి. ఉత్తర కొరియా ఆటగాళ్లు క్రీడాస్ఫూర్తిని మరిచిపోయి సిగ్గుమాలిన చర్యకు దిగారు.
సోమవారం జరిగిన పురుషుల పదిమీటర్ల షూటింగ్ పోటీల్లో ఉత్తర కొరియాకు చెందిన క్వాన్ క్వాంగ్ ఇల్, పాక్ మ్యోంగ్వాన్, సాంగ్జు యూ తృటిలో స్వర్ణాన్ని కోల్పోయారు. పోటీల్లో దక్షిణ కొరియా విజేతగా నిలిచింది. అయితే, బహుమతుల ప్రదాన సమయంలో క్రీడాస్ఫూర్తిని మరిచిపోయి వ్యవహరించారు. దక్షిణ కొరియా జాతీయ గీతం వచ్చిన సమయంలో ఆ జెండా వైపు చూసేందుకు నిరాకరించారు.
అదే సమయంలో విజేతలుగా నిలిచిన దక్షిణ కొరియా ఆటగాళ్లతో మాట్లాడేందుకు అంగీకరించలేదు. అయితే, దక్షిణ కొరియా ఆటగాళ్లు వారితో మాట్లాడేందుకు ప్రయత్నించినా కనీసం వారి వైపు చూడకుండా నిలిపోయారు. రెండుదేశాలకు చెందిన అథ్లెట్లు చివరిగా 2018 పోటీల్లో పాల్గొన్నారు. ఉత్తర కొరియాపై 2022 చివరి వరకు అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ సస్పెన్షన్ విధించింది. 2022 చివరలో నిషేధాన్ని ఒత్తివేసింది. మహమ్మారి కారణంగా గతేడాది జరగాల్సిన క్రీడలు వాయిదా పడ్డాయి.
ప్రస్తుతం జరుగుతున్న పోటీలకు ఉత్తర కొరియా అర్హత సాధించింది. ఉత్తర, దక్షిణ కొరియాల మధ్య వివాదం కొనసాగున్నది. ఈ క్రమంలో పోటీల్లోనూ ఉత్తర కొరియా షూటర్లు దక్షిణ కొరియా షూటర్లతో ఫొటోలు తీసుకునేందుకు నిరాకరించారు. జాతీయ గీతం వినిపించిన సమయంలో దక్షిణ కొరియా జెండా వైపు తిరిగేందుకు నిరాకరించారు.
అయితే, ఇదే పోటీల్లో కాంస్య పతకం సాధించిన ఆటగాళ్లు కలిసి ఫొటోలు దిగారు. మెడల్స్ బహుమతి ప్రదాన సమయంలో ఓ దక్షిణ కొరియా ఆటగాడు.. ఉత్తర కొరియా ప్లేయర్ వీపుతట్టి మాట్లాడేందుకు ప్రయత్నించగా.. పట్టించుకోకుండా నిలబడిపోయాడు. అయితే, ఉత్తర కొరియా నియంత కిమ్కు భయపడే ఆటగాళ్లు ఇలా వ్యవహరించినట్లుగా తెలుస్తున్నది. దక్షిణ కొరియా ఆటగాళ్లుతో మాట్లాడితే ఎక్కడ తమను శిక్షిస్తాడేమోనన్న భయం వారిలో కనిపించింది.