ఆసియా క్రీడల్లో భారత మహిళా అథ్లెట్లు అసమాన పోరాట పటిమతో చరత్ర సృష్టించారు. భారత క్రీడా యవనికపై సరికొత్త అధ్యాయం లిఖిస్తూ.. పసిడి కాంతులతో త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించారు. జావెలిన్ త్రోలో ఈటెను రికార్డు దూరం విసిరిన అన్ను రాణి మహిళల విభాగంలో దేశానికి తొలి స్వర్ణ పతకం అందించగా.. పారుల్ చౌదరీ 5 వేల మీటర్ల పరుగులో పసిడి పతకం చేజిక్కించుకుంది. డెకథ్లాన్లో తేజస్విన్ శంకర్ జాతీయ రికార్డు బద్దలు కొడుతూ వెండి పతకం కొల్లగొట్టగా.. మహమ్మద్ అఫ్సల్ 800 మీటర్ల పరుగులో రజతం కైవసం చేసుకున్నాడు. 400 మీటర్ల హర్డిల్స్లో విద్య, యువ బాక్సర్ ప్రీతి, నరేందర్ కాంస్యం దక్కించుకోగా.. ట్రిపుల్ జంప్లో ప్రవీణ్, కనోయ్లో అర్జున్ సింగ్-సునీల్ సింగ్ జోడీ కంచు మోత మోగించింది. వరల్డ్ చాంపియన్, ఒలింపిక్ విజేత బాక్సర్ లవ్లీనా కనీసం వెండి ఖరారు చేయగా.. ఆర్చరీలో ఒజాస్, అభిషేక్ ఫైనల్కు దూసుకెళ్లి భారత్కు స్వర్ణం ఖాయం చేశారు.
హాంగ్జౌ: ప్రతిష్ఠాత్మక ఆసియా క్రీడల్లో భారత అథ్లెట్లు వరుసగా మూడోరోజు పతకాల పంట పండించారు. అన్ను రాణి జావెలిన్ త్రోలో స్వర్ణ పతకం కైవసం చేసుకుంది. మంగళవారం జరిగిన ఫైనల్లో అన్ను ఈటెను ఏకంగా 62.92 మీటర్ల దూరం విసిరి అగ్రస్థానంలో నిలిచింది. దాంతో, జావెలిన్లో పసిడి పతకం ముద్దాడిన భారత తొలి మహిళగా రికార్డు సృష్టించింది. ఇక.. పారుల్ చౌదరీ తన పసిడి కల నిజం చేసుకుంది. 3 వేల మీటర్ల స్టీపుల్ చేజ్లో కొద్దిలో స్వర్ణం చేజార్చుకున్న ఆమె 5 వేల మీటర్ల పరుగులో అదరగొట్టింది. 15 నిమిషాల14.75 సెకన్లలో లక్ష్యాన్ని చేరి గోల్డ్ మెడల్ చేజిక్కించుకుంది. ఫినిషింగ్ లైన్కు 40మీటర్ల దూరంలో అమాంతం వేగం పెంచిన పారుల్.. జపాన్ అథ్లెట్ను అధిగమించి విజేతగా నిలిచింది. 800 మీటర్ల పరుగులో మహమ్మద్ అఫ్సల్ 1నిమిషం48.43 సెకన్లతో వెండి పతకం దక్కించుకోగా.. పది ఈవెంట్ల పోటీ డెకథ్లాన్లో తేజస్విన్ శంకర్ 7,666 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచి సిల్వర్ మెడల్ సొంతం చేసుకున్నాడు. 92 కిలోల విభాగంలో బాక్సర్ నరేందర్ బెర్వాల్, 54 కిలోల విభాగంలో యువ బాక్సర్ ప్రీతి పవార్ సెమీస్లో ఓడి కాంస్యంతో సరిపెట్టుకున్నారు. 400 మీటర్ల హర్డిల్స్లో విద్య కాంస్యంతో రెండో పతకం ఖాతాలో వేసుకుంది. కనోయ్ డబుల్స్లో అర్జున్ సింగ్, సునీల్ సింగ్ ద్వయం కాంస్య పతకంతో మెరవడంతో.. మంగళవారం పోటీలు ముగిసే సరికి భారత్ పతకాల సంఖ్య 69 (15 స్వర్ణాలు, 26 రజతాలు, 28 కాంస్యాలు)కి చేరింది.
800 మీటర్ల పరుగులో మహమ్మద్ అఫ్సల్ అదరగొట్టాడు. 1 నిమిషం 48.43 సెకనల్లో ఫినిషింగ్ లైన్కు చేరుకున్నాడు. మరో 0.38 సెకన్ల ముందు లక్ష్యాన్ని చేరుకొని ఉంటే గోల్డ్ మెడల్ ఒడిసిపట్టేవాడు. ఈ విభాగంలో సౌదీ అరేబియా అథ్లెట్ ఎస్సా అలీ క్వాజిన్ స్వర్ణం గెలుపొందాడు. మరోవైపు పురుషుల బాక్సింగ్లో నరేందర్ బెర్వాల్ కాంస్యంతో మెరిశాడు. సెమీఫైనల్లో కజకిస్థాన్ బాక్సర్ కమ్షిబెక్ కుంకబయెవ్ చేతిలో 0-5తో ఓటమి పాలయ్యాడు. దాంతో, 19వ ఆసియా క్రీడల పురుషుల విభాగంలో పతకం కైవసం చేసుకున్న భారత బాక్సర్గా నరేందర్ రికార్డులకెక్కాడు. స్టార్ బాక్సర్లు తేలిపోయిన చోట నరేందర్ తన పవర్ పంచ్తో పరువు నిలబెట్టాడు. యువ బాక్సర్ ప్రీతి పవార్ మహిళల 54 కిలోల విభాగంలో కాంస్య పతకంతో సరిపెట్టుకుంది. సెమీఫైనల్లో చైనా బాక్సర్ చాంగ్ యువాన్ చేతిలో 0-5 పాయింట్ల తేడాతో ఓడి వెండి పతకం చేజార్చుకుంది.
ఆర్చరీ పురుషుల వ్యక్తిగత విభాగంలో భారత్కు పసిడి ఖరారైంది. ఒజాస్ ప్రవీణ్ డియోతలే ఆసియా క్రీడల రికార్డు బద్దలు కొడుతూ ఫైనల్కు చేరాడు. ప్రవీణ్ సెమీఫైనల్లోనూ 150 పాయింట్లతో దక్షిణి కొరియాకు చెందిన యాంగ్ జీవొన్ను చిత్తు చేశాడు. మరో మ్యాచ్లో అభిషేక్ వర్మ దక్షిణ కొరియాకే చెందిన జూ జీహూన్పై 147-145 తేడాతో గెలుపొందాడు. దీంతో ఫైనల్లో ఇద్దరు భారతీయుల మధ్య పోటీ జరుగనుంది.
పది క్రీడల ఈవెంట్ డెకథ్లాన్లో తేజస్విన్ శంకర్ జాతీయ రికార్డు బద్ధలు కొట్టి రజతం దక్కించుకున్నాడు. మొదట నిర్వహించిన లాంగ్ జంప్, హై జంప్, 400 మీటర్ల పరుగులో అగ్రస్థానంలో నిలిచిన శంకర్ మిగతా ఈవెంట్స్లో అదే జోరు కొనసాగించలేకపోయాడు. షాట్పుట్, 110 మీటర్ల హర్డిల్స్, జావెలిన్ త్రోలో 5వ స్థానంలో.. పోల్వాల్ట్లో చివరి స్థానంలో నిలిచి 7,666 పాయింట్లతో సిల్వర్ మెడల్ అందుకున్నాడు.
అథ్లెటిక్స్లో విద్య రామరాజ్ డబుల్ ధమాకాతో అదరగొట్టింది. 400 మీటర్ల మిక్స్డ్ రీలేలో వెండి పతకం నెగ్గిన విద్య మంగళవారం మరో పతకంతో మెరిసింది. 400 మీటర్ల హర్డిల్స్లో కాంస్యం కైవసం చేసుకుంది. ఫైనల్లో ఆమె 55.68 సెకన్లలో లక్ష్యాన్ని చేరుకొని మూడోస్థానంలో నిలిచింది.
ట్రిపుల్ జంప్లో ప్రవీణ్ చిత్రవేల్ కాంస్యం దక్కించుకున్నాడు. ఫైనల్లో 16.68 మీటర్ల ప్రదర్శనతో మూడో స్థానంలో నిలిచాడు. ఈ పోటీలో భారత్కే చెందిన అబూబాకర్ 16.62మీటర్లతో నాలుగో స్థానంలో నిలిచాడు. చైనాకు చెందిన యమింగ్ జూ, యావోకింగ్ ఫాంగ్ పసిడి, వెండి పతకాలు ఎగరేసుకుపోయారు.
కనోయ్ డబుల్స్లో 1000 మీటర్ల పోటీలో అర్జున్ సింగ్, సునీల్ సింగ్ సత్తా చాటారు. నీటి అలలపై రయ్ రయ్ మంటూ దూసుకెళ్లి దేశానికి కాంస్య పతకం అందించారు.అర్జున్, సునీల్ 3ః53.329 నిమిషాల్లో లక్ష్యాన్ని చేరుకున్నారు. ఈ పోటీల్లో ఉజ్బెకిస్థాన్, కజకిస్థాన్ వరుసగా పసిడి, వెండి పతకాలు చేజిక్కించుకున్నాయి.
స్టార్ బాక్సర్ లవ్లీనా బొర్గోహై మహిళల 75 కేజీల విభాగంలో ఫైనల్కు దూసుకెళ్లడంతో పాటు.. వచ్చే ఏడాది జరుగనున్న పారిస్ ఒలింపిక్స్ బెర్త్ ఖరారు చేసుకుంది. సెమీస్లో లవ్లీనా 10-0తో థాయ్లాండ్ బాక్సర్ బైసన్ మనీకోన్ను మట్టికరిపించింది. భారత మహిళల హాకీ జట్టు అద్భుత పోరాటంతో సెమీస్లో అడుగుపెట్టింది. మంగళవారం ఏకపక్షంగా జరిగిన క్వార్టర్ ఫైనల్లో హాంకాంగ్ను 10-0తో మట్టికరిపించింది. తద్వారా పతకం ఖారారు చేసింది. స్కాష్ పురుషుల సింగిల్స్లో సౌరభ్ ఘోషాల్ సెమీస్లో అడుగు పెట్టాడు. దీంతో అతడికి కనీసం కాంస్యం ఖరారైంది.
ఆసియా క్రీడల్లో నేటి నుంచి రెజ్లింగ్తో పాటు పురుషుల జావెలిన్ పోటీలు ప్రారంభం కానున్నాయి. మల్లయుద్ధంలో మనవాళ్లకు తిరుగులేకపోగా.. ప్రపంచ చాంపియన్ నీరజ్ చోప్రా ఫేవరెట్గా బరిలోకి దిగనున్నాడు. ఇక పురుషుల హాకీ జట్టు సెమీఫైనల్లో కొరియాతో తలపడనుంది.