తీవ్ర ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంక లో ఆ దేశ క్రికెట్ బోర్డు పరిస్థితి కూడా అంతంతమాత్రమే. ఆదాయాల్లేక ఆగమైపోతున్న శ్రీలంక క్రికెట్ (ఎస్ఎల్సీ) ఆసియా కప్ ను తామే నిర్వహిస్తామని, ఎంతకష్టమైనా భరిస్తామని ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ), భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)ల కార్యదర్శి జై షా సహా ఇతర అధికారులకు విజ్ఞప్తి చేసింది. ఈ టోర్నీని నిర్వహించకుంటే తాము సుమారు ఐదు నుంచి ఆరు మిలియన్ డాలర్ల ఆదాయం కోల్పోతామని, ప్రస్తుత పరిస్థితుల్లో అంత పెద్ద అమౌంట్ తమకు చాలా అవసరమని వాదిస్తున్నది.
శ్రీలంకలో నెలకొన్న పరిస్థితుల కారణంగా ఈ ఏడాది ఆగస్టులో ఆ దేశంలో నిర్వహించతలపెట్టిన ఆసియా కప్ వేదికను మార్చాలని ఏసీసీ భావిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏసీసీ తో పాటు బీసీసీఐ అధికారులను కలిసిన ఎస్ఎల్సీ సభ్యులు.. ఎంత కష్టమైనా ఆసియా కప్ ను తామే నిర్వహిస్తామని వారికి విన్నవించారు.
ఇదే విషయమై ఎస్ఎల్సీ సెక్రెటరీ మోహన్ డిసిల్వ మాట్లాడుతూ.. ‘ఇప్పటివరకు తుది నిర్ణయం (ఆసియా కప్ నిర్వహణపై) తీసుకోలేదు. దానికంటే ముందు మేము ఆస్ట్రేలియా సిరీస్ నిర్వహించాల్సి ఉంది. మా ముందున్న పెద్ద సవాల్ అదే. అది మేం సజావుగా నిర్వహిస్తే ఆసియా కప్ కు కూడా ఆతిథ్యం ఇవ్వగలం. జై షా తో పాటు ఏసీసీ అధికారులు కూడా మాతో ఇదే చెప్పారు..’ అని అన్నారు.
ప్రస్తుత పరిస్థితుల్లో లంకకు ఆసియా కప్ ఆతిథ్య హక్కులు దక్కించుకోవడం అత్యావశ్యకం. ఈ టోర్నీ ద్వారా వచ్చే ఆదాయంతో అయినా ఎస్ఎల్సీ.. ఆటగాళ్లు, సిబ్బందికి జీతభత్యాలు, ఇతర వసతులు కల్పించే అవకాశముంటుంది. అయితే అదే సమయంలో ఆసియా కప్ ను నిర్వహించడం లంకకు కత్తిమీద సాము వంటిదే.
ఆ దేశంలో ఇప్పుడు అధికారికంగా కరెంట్ కోతలు.. పెట్రోల్, డీజిల్ నిల్వలు అడుగంటడంతో పాటు ద్రవ్యోల్భణం పెరిగి పోవడంతో మ్యాచుల నిర్వహణ అనేది మాములు విషయం కాదు. ఇప్పుడు లంక బోర్డు దృష్టంతా ఆస్ట్రేలియా సిరీస్ మీదే. జూన్ 7 నుంచి ఈ సిరీస్ ప్రారంభం కావాల్సి ఉంది. ఇప్పటికే ఆసీస్ జట్టు లంకకు చేరింది.