అంతర్జాతీయ క్రికెట్ నుంచి కొంత గ్యాప్ తీసుకొని టీమిండియాలోకి మళ్లీ పునరాగమనం చేస్తున్న విరాట్ కోహ్లీపై భారీ అంచనాలున్నాయి. కొంతకాలంగా ఫామ్ లేమితో బాధపడుతున్న అతను.. ఇంగ్లండ్ పర్యటనలో కూడా పరుగులు చేయడంలో విఫలమయ్యాడు. దీంతో అతన్ని వెస్టిండీస్, జింబాబ్వే పర్యటనలకు ఎంపిక చెయ్యలేదు.
ఈ రెండు సిరీసుల్లో కోహ్లీకి బీసీసీఐ విశ్రాంతినిచ్చింది. ఈ నెలాఖరు నుంచి ప్రారంభమయ్యే ఆసియా కప్లో మళ్లీ కోహ్లీని బ్లూజెర్సీలో చూడబోతున్నాం. ఈ క్రమంలో ఆసియా కప్ అతనికి చాలా కీలకం కానుందని పాకిస్తాన్ మాజీ క్రికెటర్ దానిష్ కనేరియా అన్నాడు.
‘‘ఆసియా కప్ కోహ్లీ కెరీర్ను మార్చేస్తుంది. అతని కెరీర్ను మరింత పొడిగించుకోవడానికి ఈ సిరీస్ బాగా ఉపయోగపడుతుంది. పరుగులు చెయ్యకపోతే జట్టుకు కోహ్లీ భారమని చాలా మంది అన్నారు. కాబట్టి అతను ఇప్పుడు పరుగులు చేసి తన సత్తా నిరూపించుకోవాలి. అయ్యర్, శాంసన్, గిల్ వంటి ఆటగాళ్లు వెయిటింగ్లో ఉన్నారు కాబట్టి కోహ్లీ సరిగా ఆలోచించి మంచి ఫామ్తో పునరాగమనం చేయాలి’’ అని కనేరియా అన్నాడు.
తనను అడిగితే కోహ్లీ నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేయాలని చెప్పాడు. ఫామ్లో ఉన్న సూర్యకుమార్ను మూడో స్థానంలో పంపాలని, కుదురుకోవడానికి కొంత టైం తీసుకొనే కోహ్లీ నాలుగో స్థానంలో దిగాలని అతను వివరించాడు. మరి ఆసియా కప్లో కోహ్లీ ఏం చేస్తాడో మరి.