కొలంబో: చివరి వరకు నువ్వా నేనా అన్నట్లు సాగిన ఉత్కంఠ పోరులో విజయం సాధించిన శ్రీలంక ఆసియాకప్ ఫైనల్కు చేరింది. సూపర్-4లో భాగంగా గురువారం జరిగిన మ్యాచ్లో లంక 2 వికెట్ల తేడాతో పాకిస్థాన్పై గెలిచింది. దీంతో 4 పాయింట్లు ఖాతాలో వేసుకున్న సింహళి జట్టు ఆదివారం భారత్తో జరుగనున్న తుదిపోరుకు అర్హత సాధించింది.
వర్షం కారణంగా 42 ఓవర్లకు కుదించిన పోరులో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 252 పరుగులు చేసింది. వికెట్ కీపర్ బ్యాటర్ మహమ్మద్ రిజ్వాన్ (86 నాటౌట్; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) టాప్ స్కోరర్ కాగా.. అబ్దుల్లా షఫీఖ్ (52; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), ఇఫ్తిఖార్ అహ్మద్ (47; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించారు. అనంతరం లక్ష్యఛేదనలో లంక సరిగ్గా 42 ఓవర్లలో 8 వికెట్లకు 252 పరుగులు చేసింది. అయితే డక్వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం శ్రీలంకను విక్టరీ వరించింది. కుషాల్ మెండిస్ (91), సమరవిక్రమ (48), అసలంక (49 నాటౌట్) ఆకట్టుకున్నారు.