Sunil Gavaskar | ఆసియా కప్ కోసం బీసీసీఐ సెలెక్షన్ కమిటీ జట్టును ప్రకటించింది. ఇందులో సీనియర్ ఆటగాళ్లు రవిచంద్రన్ అశ్విన్తో పాటు యుజ్వేంద్ర చాహల్కు చోటుదక్కలేదు. అయితే, ఇద్దరిని ఎంపిక చేయకపోవడంపై అభిమానులు నిరాశకు గురయ్యారు. అయితే, ఇద్దరికి మద్దతుగా పలువురు అభిమానులు పోస్టులు పెడుతున్నారు. పాక్, శ్రీలంకలో జరిగే ఆసియా కప్ కోసం 17 మంది సభ్యులతో జట్టును ప్రకటించగా.. ఇందులో స్పిన్నర్లు రవీంద్ర జడేలా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్లకు సెలెక్షన్ కమిటీ అవకాశం ఇచ్చింది. అశ్విన్, చాహల్ను పక్కనపెట్టింది. ఈ క్రమంలో భారత మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ ఘాటుగా స్పందించారు. సోషల్ మీడియాలో సాగుతున్న చర్చ పనికాదన్నారు.
జట్టు విషయంలో ఎలాంటి వివాదాలకు తావుండదని పేర్కొన్నారు. ఎవరి కోసం తలుపులు మూసివేయలేదని, జట్టులో కేవలం 17 మంది ఆటగాళ్లను మాత్రమే ఎంపిక చేయవచ్చని, అలాంటి పరిస్థితుల్లో కొందరిని జట్టు నుంచి దూరం పెట్టారన్నారు. ఓ చానెల్ నిర్వహించిన కార్యక్రమంలో గవాస్కర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓ అభిమాని అశ్విన్పై ప్రశ్నలు సంధించడంతో మాజీ కెప్టెన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమను తాము అదృష్టవంతులుగా భావించే ఆటగాళ్లు కొందరు ఉన్నారని, కానీ జట్టు ఎంపిక ఇప్పటికే పూర్తయ్యిందన్నారు. ఇకపై అశ్విన్ ఎంపికపై మాట్లాడొద్దని, వివాదాలను సృష్టించడం ఆపాలన్నారు. జట్టు మీకు నచ్చకపోతే మ్యాచ్ చూడకండి.. కానీ, అతన్ని ఎంపిక చేయాలి.. అతన్ని తీసుకోవాల్సింది అని చెప్పడం మానేయాలన్నారు. అవి తప్పుడు ఆలోచనలన్నారు. ఈ సందర్భంగా స్పందిస్తూ తమకు అన్యాయం జరిగిందని ఎవరూ చెప్పలేరని.. తనకు అన్యాయం జరిగిందని ఏ ఆటగాడు చెప్పుకోలేడన్నారు.
ఆసియా కప్ కోసం జట్టులో అనుభవజ్ఞులైన, ఫామ్లో ఉన్న ఆటగాళ్లను ఎంపిక చేశారని మాజీ కెప్టెన్ చెప్పారు. గాయంతో కొద్దిరోజులు జట్టుకు దూరమైన కేఎల్ రాహుల్ను ఆసియా కప్ కోసం జట్టులోకి తీసుకోవడంపై సెలెక్షన్ కమిటీకి మద్దతు తెలిపారు. ఆసియా కప్ గెలువడం ముఖ్యమేనని.. కానీ లక్ష్యం ప్రపంచకప్ అని గవాస్కర్ పేర్కొన్నారు. టీమ్ మేనేజ్మెంట్ ప్రపంచకప్ జట్టులో కేఎల్ రాహుల్ ఉండాలని కోరుకుంటే.. కొంచెం ఇబ్బంది అయినప్పటికీ ఆసియా కప్కు ఎంపిక చేయడం సరైందేనని భావిస్తున్నానన్నారు. భారత్ విషయానికి వస్తే ఇంకా 11 రోజుల సమయం ఉందని, కష్టాల నుంచి బయటపడేందుకు ఆ సమయం సరిపోతుందన్నారు. అతనికి అవకాశం ఇవ్వడమేనని న్యాయమని భావిస్తున్నానన్నారు.