IND vs SL | అద్భుత బౌలింగ్తో శ్రీలంకను అలవోకగా చిత్తుచేసిన టీమ్ఇండియా రికార్డు స్థాయిలో ఎనిమిదోసారి ఆసియాకప్ ముద్దాడింది. హైదరాబాదీ పేసర్ మహమ్మద్ సిరాజ్ ఆరు వికెట్లతో సత్తాచాటితే.. హార్దిక్ పాండ్యా మూడు వికెట్లతో మురిపించాడు. అంతకుముందు ఇన్నింగ్స్ తొలి ఓవర్లోనే జస్ప్రీత్ బుమ్రా.. లంకకు భారీ షాక్ ఇచ్చాడు. ముగ్గురు పేసర్లు కలిసి 10 వికెట్లు ఖాతాలో వేసుకోవడంతో.. ఆతిథ్య శ్రీలంక 50 పరుగులకే ఆలౌట్ అయింది. సిరాజ్కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, కుల్దీప్కు మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు దక్కాయి. ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ.. అసలు ఈ టోర్నీ నిర్వహణే పెద్ద సంకటంగా మారిన సమయంలో లంక బోర్డు గ్రౌండ్స్మెన్ చూపిన పట్టుదల వెలకట్టలేనిది. భారత్ కప్పు గెలిచిందన్నా.. రికార్డులు తిరగరాసిందన్నా ఆ క్రెడిట్ మొత్తం మైదానం సిబ్బందికే వెళ్తుంది.
ఒక్క మ్యాచ్కు వర్షం అంతరాయం కలిగిస్తేనే చికాకు పడి స్టార్లు ఆడుతున్న మ్యాచ్లు చూసేందుకు సైతం ప్రేక్షకులు మొహం చాటేసిన వేళ.. వరుణుడు గంట గంటకు దోబూచులాడుతూ సహనాన్ని పరీక్షించిన సమయాన.. మైదాన సిబ్బంది చూపిన తెగువకు ఎన్ని పురస్కారాలు ఇచ్చినా తక్కువే! ఆసియాకప్ నిర్వహించేందుకు కొలంబో వాతావరణం సహకరించదని ముందే తెలిసినా.. హంబన్టోటా వంటి చిన్న పట్టణంలో ఆడేందుకు ప్లేయర్లు అంగీకరించలేదనే కారణంతో టోర్నీలో అత్యధిక మ్యాచ్లను ప్రేమదాస స్టేడియంలో నిర్వహించారు. భారత్, పాకిస్థాన్ మ్యాచ్తో ప్రారంభమైన వరుణుడి బెడద.. శ్రీలంక, టీమ్ఇండియా మధ్య ఆదివారం జరిగిన ఫైనల్ వరకు కొనసాగింది. దాదాపు ప్రతి మ్యాచ్కు వర్షం ఆటంకం కలిగించినా.. ఏమాత్రం వెనక్కి తగ్గకుండా గ్రౌండ్స్మెన్ సమర్థవంతంగా విధులు నిర్వర్తించడంతోనే ఈ టోర్నీ సజావుగా సాగింది. దీంతో ఆసియా క్రికెట్ కౌన్సిల్ మైదాన సిబ్బందికి రూ. 41.50 లక్షల నగదు పురస్కారంతో సత్కరించింది.