IND vs AUS | సొంతగడ్డపై తిరుగులేని ఆధిపత్యం కనబరుస్తూ.. ‘బోర్డర్-గవాస్కర్’ సిరీస్ చేజిక్కించుకున్న టీమ్ఇండియా.. ఇక వన్డే వార్కు సిద్ధమైంది. మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా నేడు భారత్, ఆస్ట్రేలియా మధ్య వాంఖడే వేదికగా తొలి వన్డే జరుగనుంది. ఈ ఏడాది ఆఖర్లో భారత్లో వన్డే ప్రపంచకప్ జరుగనున్న నేపథ్యంలో ఇరు జట్లకు ఈ సిరీస్ కీలకంగా మారగా.. వ్యక్తిగత కారణాల వల్ల తొలి మ్యాచ్కు భారత సారథి రోహిత్ శర్మ దూరమయ్యాడు. అతడి స్థానంలో పేస్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా జట్టును నడిపించనుండగా.. ఆఖరి టెస్టులో భారీ సెంచరీతో చెలరేగిన విరాట్ కోహ్లీ అదే జోరు పరిమిత ఓవర్ల క్రికెట్లోనూ కొనసాగిస్తాడా చూడాలి!
ముంబై: వన్డే ప్రపంచకప్ ముంగిట టీమ్ఇండియా మరో ఆసక్తికర సిరీస్కు రెడీ అయింది. మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా శుక్రవారం వాంఖడేలో భారత్, ఆస్ట్రేలియా అమీతుమీ తేల్చుకోనున్నాయి. భారత ఉపఖండంలో మెగాటోర్నీ జరుగనున్న నేపథ్యంలో కంగారూలు ఈ సిరీస్ను రిహార్సల్స్గా భావిస్తుంటే.. గాయాలతో సతమతమవుతున్న భారత్ జట్టు కూర్పును చెక్ చేసుకోనుంది. రోహిత్ గైర్హాజరీలో ఈ మ్యాచ్కు హార్దిక్ పాండ్యా సారథ్యం వహిస్తున్నాడు. సునీల్ గవాస్కర్ వంటి మాజీల చేత భావి కెప్టెన్ అని ప్రశంసలు అందుకుంటున్న పాండ్యా.. జట్టును ఎలా విజయపథాన నడుపుతాడో చూడాలి. పొట్టి ఫార్మాట్లో గత కొంతకాలంగా జాతీయ జట్టుకు కెప్టెన్గా వ్యవహరిస్తున్న పాండ్యా.. సీనియర్లతో కూడిన జట్టును ఎలా ముందుకు తీసుకెళ్తాడనేది ఆసక్తికరం.
ఆస్ట్రేలియాతో ఇటీవల ముగిసిన నాలుగు టెస్టుల ‘బోర్డర్-గవాస్కర్’ సిరీస్ను 2-1తో చేజిక్కించుకున్న భారత్.. అదే ఊపులో వన్డే సిరీస్ను కూడా కైవసం చేసుకోవాలని చూస్తున్నది. మరోవైపు టెస్టుల్లో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన ఆసీస్.. వన్డేల్లో మరింత బలంగా కనిపిస్తున్నది. కమిన్స్ ఈ సిరీస్కూ దూరం కాగా.. చివరి రెండు టెస్టుల్లో జట్టును నడిపించిన స్మిత్ వన్డేల్లోనూ జట్టుకు సారథ్యం వహించనున్నాడు. గాయాల నుంచి కోలకున్న గ్లెన్ మ్యాక్స్వెల్, డేవిడ్ వార్నర్, మిషెల్ మార్ష్ రాకతో ఆ జట్టు పటిష్టంగా మారింది.
స్వదేశంలో ఈ ఏడాది టీమ్ఇండియా ఆడిన ఆరు వన్డేల్లోనూ నెగ్గి ఫుల్ జోష్లో ఉంది. యువ ఓపెనర్ శుభ్మన్ గిల్ అదరగొడుతుండగా.. రోహిత్ శర్మ గైర్హాజరీలో గిల్తో కలిసి ఇషాన్ కిషన్ ఇన్నింగ్స్ ఆరంభించనున్నాడు. మూడో స్థానంలో విరాట్ కోహ్లీ బ్యాటింగ్కు రానున్నాడు. గత ఆరు నెలల్లో మూడు ఫార్మాట్లలో కలిపి ఐదు సెంచరీలతో మునుపటి ఫామ్ అందుకున్న విరాట్.. ఆసీస్పై అదే దూకుడు కొనసాగించాలని చూస్తున్నాడు. నాలుగో స్థానం కోసం సూర్యకుమార్ యాదవ్, రజత్ పాటిదార్ మధ్య పోటీ నెలకొన్నా.. టీమ్ మేనేజ్మెంట్ సూర్యకుమార్ వైపు మొగ్గు చూపేలా కనిపిస్తున్నది. పేలవ ఫామ్ కారణంగా ఆసీస్తో చివరి రెండు టెస్టులకు జట్టులో చోటు కోల్పోయిన కేఎల్ రాహుల్.. వికెట్ కీపర్గా మిడిలార్డర్లో బ్యాటింగ్కు దిగనున్నాడు.
వన్డేల్లో ఐదో స్థానంలో అతడి ప్రదర్శన జట్టుకు అదనపు బలం చేకూరుస్తున్నది. ఆ తర్వాత హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా బ్యాటింగ్కు రానున్నారు. రెండో స్పిన్నర్గా అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్లో ఒకరిని ఎంపిక చేయనున్నారు. మహమ్మద్ సిరాజ్, షమీ, శార్దూల్ ఠాకూర్ పేస్ బాధ్యతలు మోయనున్నారు. మరోవైపు ఆస్ట్రేలియా జట్టు ఆల్రౌండర్లతో నిండుగా ఉంది. మార్ష్, స్టోయినిస్, మ్యాక్స్వెల్, గ్రీన్ రూపంలో వారికి నలుగురు నాణ్యమైన ఆల్రౌండర్లు అందుబాటులో ఉన్నారు.
వర్క్లోడ్తో ఇబ్బంది అనేది కొందరి ఊహ మాత్రమే. ఆటగాళ్లకు దాంతో ఇబ్బందేం లేదు. గత కొన్ని సిరీస్లను గమనిస్తే.. భారత జట్టు దూకుడుగా ఆడుతున్నది. ఇప్పుడు కూడా దాన్నే కొనసాగిస్తాం. ద్వైపాక్షిక సిరీస్ల్లో రసవత్తర సమరాలు ఎదురైతే.. ఐసీసీ నాకౌట్స్ మ్యాచ్లకు అది పనికి వస్తుంది. పరిస్థితులకు తగ్గట్లు ఆడడానికి ఇష్టపడతా. శ్రేయస్ అయ్యర్ గాయంతో సిరీస్కు దూరమయ్యాడు. ఆటగాళ్లన్నాక గాయాలు సహజం. ప్రతి ఒక్కరి కెరీర్లో ఇలాంటి దశ ఎదురవుతుంది. దాన్ని దాటడం ముఖ్యం. భారత జట్టులో నైపుణ్యానికి కొదవలేదు. ప్రపంచ టెస్టు చాంపియన్షిప్లో నేను ఆడటం సాధ్యపడదు.
-హార్దిక్ పాండ్యా, భారత కెప్టెన్
సాధారణంగా వాంఖడే పిచ్ ఫ్లాట్గా ఉండి.. బ్యాటింగ్కు సహకరిస్తుంది. ఈ సారి కూడా అందుకు బిన్నం కాకపోవచ్చు. ఇరు జట్ల మధ్య చివరిసారి ఇక్కడ జరిగిన మ్యాచ్లో ఆస్ట్రేలియా భారీ విజయం నమోదు చేసుకుంది. టాస్ గెలిచిన జట్టు ఛేదనకే మొగ్గుచూపొచ్చు. మ్యాచ్కు వర్ష సూచనలేదు.
భారత్: పాండ్యా (కెప్టెన్), గిల్, ఇషాన్, కోహ్లీ, సూర్యకుమార్, రాహుల్, జడేజా, అక్షర్/సుందర్, శార్దూల్, సిరాజ్, షమీ/ఉమ్రాన్.
ఆస్ట్రేలియా: స్మిత్ (కెప్టెన్), వార్నర్, హెడ్, లబుషేన్, మార్ష్/స్టొయినిస్, మ్యాక్స్వెల్, కారీ, గ్రీన్, స్టార్క్, జంపా, ఎల్లిస్